ఏపీ గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలకు లైన్ క్లియర్.. పిటిషన్ తోసిపుచ్చిన హైకోర్టు..!
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియ మొదలైంది. ఇంటర్వ్యూల ద్వారా గ్రామ వాలంటీర్లను ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ బుధవారం నాడు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలో గురువారం నాడు తలపెట్టిన ఇంటర్వ్యూ ప్రక్రియకు బ్రేక్ పడుతుందేమోనని అభ్యర్థులు కంగారుపడ్డారు. తీరా న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇంటర్వ్యూ ప్రక్రియ స్టార్ట్ అయింది.
ఎన్నికల హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వాలంటీర్లను నియమించేందుకు సీఎం వైఎస్ జగన్ సన్నద్ధమయ్యారు. ఆ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేయడంతో నియామక ప్రక్రియ ఊపందుకుంది. దరఖాస్తులు ఆహ్వానించడంతో 1,81,885 పోస్టులకు గాను దాదాపు 9 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో అభ్యర్థులను ఫిల్టర్ చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
మొదలే కాలేదు అప్పుడే లొల్లి.. హైకోర్టుకు చేరిన ఏపీ గ్రామ వాలంటీర్ల కథ..!
వాలంటీర్లు వచ్చేస్తున్నారు.. ఇంటర్వ్యూలు ప్రారంభం
ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామకాలకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ గురువారం (11.07.2019) నుంచి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తోంది. ఒకవేళ ఏదైనా మండలంలో ఏడు వందలకు పైగా అప్లికేషన్లు వస్తే.. అదనంగా ఇంటర్వ్యూ బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.
ఈ నెల 20వ తేదీ వరకు ఇంటర్వ్యూల ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు అధికారులు. ఇంటర్వ్యూ ప్రక్రియలో భాగంగా తొలి రోజు గురువారం నాడు ఒక్కో చోట 30 మందిని మాత్రమే ఇంటర్వ్యూలకు పిలవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక రెండో రోజు నుంచి మాత్రం రోజుకు 60 మంది చొప్పున ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. దివ్యాంగులు, మహిళా అభ్యర్థులను మాత్రం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య ఇంటర్వ్యూలకు పిలవాలని ఆదేశాలు అందాయి.
నియామకాలను ఆపేందుకు నో చెప్పిన హైకోర్టు..!
వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ బుధవారం నాడు మేడికొండూరుకు చెందిన శివరామకృష్ణ, గుంటూరు జిల్లా కొర్రపాడుకు చెందిన బసవయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ అదే రోజు విచారణ జరిపారు. అయితే గ్రామ వలంటీర్ల ఎంపిక ప్రక్రియను ఆపేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు దాఖలైన అనుబంధ పిటిషన్ను తోసిపుచ్చింది.
మంత్రి నా కాళ్లు మొక్కుడేంది.. ఆ వార్తపై హరీష్ రావు ఆగ్రహం.. చివరకు సారీ చెప్పారుగా..!
Recommended Video
పిటిషనర్ల న్యాయవాది ఏమన్నారంటే..!
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా గ్రామ వాలంటీర్లను నియమించాలనుకోవడం సరికాదన్నారు. అది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దమని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. నివాస ప్రాంతం, పుట్టిన ఊరు ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయడం 16వ అధికరణకు తూట్లు పొడవడమేనంటూ గుర్తు చేశారు. సొంత గ్రామాల్లో అభ్యర్థులు అప్లై చేసుకోవాలనే నిబంధన అవకతవకలకు దారితీసే అవకాశముందన్నారు. స్థానిక ఎంపీడీవోలు తమకు నచ్చినవారిని ఎంపిక చేసుకునే ఆస్కారముందని తెలిపారు. అందుకే ఇంటర్వ్యూ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు
ఇంటర్వ్యూలు ఆపే ప్రసక్తి లేదు.. ఏజీ వాదనలతో ఏకీభవించిన జడ్జి
అదలావుంటే ప్రభుత్వం తరపున ఏజీ ఎస్.శ్రీరామ్ కోర్టులో వాదనలు వినిపించారు. గ్రామ వాలంటీర్ పోస్టులు క్యాడర్ పోస్టులు కాదని.. వాటికి కాలపరిమితి లేదని తెలిపారు. అంతేకాదు ఆ పోస్టుల్లో నియమితులైనవారికి పదవీ విరమణ లేదని.. సర్వీస్ గ్యారెంటీ కూడా లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పథకాల్ని ఇంటింటికీ చేర్చడమే లక్ష్యంగా గ్రామ వాలంటీర్లకు కేవలం నెలకు 5వేల రూపాయల గౌరవం వేతనం మాత్రమే ఇవ్వనున్నారని.. ఎలాంటి అదనపు సౌకర్యాలు కూడా లేవని వివరించారు.
కేవలం ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్ కారణంగా 9 లక్షల మందికి నిర్వహించనున్న నియామక ప్రక్రియను ఆపడం సమంజసం కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఏజీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూ ప్రక్రియను ఆపేందుకు నిరాకరించారు. అదలావుంటే ప్రధాన పిటిషన్ను స్వీకరించి.. చీఫ్ సెక్రటరీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపల్ శాఖ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులకు, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు.