జల్శక్తి మంత్రితో అనిల్ కుమార్ యాదవ్ భేటీ: తెలంగాణ.. పోలవరం.. రాయలసీమ: అజెండా అదే
అమరావతి: రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్తో భేటీ అయ్యారు. ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులు మిథున్ రెడ్డి, లావు కృష్ణదేవరాయలు, గోరంట్ల మాధవ్ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిర్మాణం కొనసాగించడం, తెలంగాణతో తలెత్తిన కృష్ణా జలాల వాటా వంటి అంశాలపై ఆయనతో కేంద్రమంత్రితో చర్చించారు.
వైఎస్ జగన్ దిద్దుబాటు: చంద్రబాబు హయాంలో కూల్చేసిన దేవాలయాల పునర్నిర్మాణం?
పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున.. దీని నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును కేంద్రం రీఎంబర్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా మూడువేల కోట్ల రూపాయల మేర బకాయిలు, పునరావాస ప్యాకేజీ నిధులను కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. ఈ మొత్తాన్ని చెల్లిస్తామంటూ ఇటీవలే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్లో ప్రకటించారు. ఈ మొత్తాన్ని వీలైనంత త్వరగా విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని అనిల్ కుమార్ యాదవ్ తాజాగా జల్శక్తి మంత్రికి విజ్ఙప్తి చేశారు.
2021 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని తాము రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చామని, అప్పటికల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణతో నెలకొన్న కృష్ణా జలాల వివాదాలను పరిష్కరించుకోవడానికి అపెక్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిని కోరినట్లు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నిజానికి- ఈ కమిటీ భేటీ రెండుసార్లు వాయిదా పడింది. కిందటి నెల 5వ తేదీన, అదే నెల 24వ తేదీన నిర్వహించాల్సి ఉంది. గజేంద్ర సింగ్ షెఖావత్ కరోనా వైరస్ బారిన పడటం వల్ల రెండోసారి భేటీ వాయిదా పడింది.
తెలంగాణతో తలెత్తిన జల వివాదాలను ఎంత వేగంగా పరిష్కరించుకోగలిగితే.. అంత వేగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని చేపడుతామని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దశాబ్దాల తరబడి కరవుకు గురవుతోన్న రాయలసీమలోని నాలుగు జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎత్తిపోతల పథకానికి ప్రణాళికలను రూపొందించారని అన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణలో భాగంగా చేపట్టిన పథకమే కావడం, దీనికి పర్యావరణ అనుమతులు అక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం స్వయంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు సూచించడం వంటి చర్యలు తమకు సానుకూలంగా ఉన్నాయని అన్నారు.