ఏపీలో రాబోయే 4 రోజులు భారీ వర్షాలు... మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక...
బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో రాబోయే 4 రోజులు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడనున్నాయి. వాయువ్య బంగాఖాతం,దాని పరిసర ప్రాంతాల్లో గురువారం(అగస్టు 13) అల్పపీడనం ఏర్పడనుందని... దాని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఈ నాలుగు రోజులు తీర ప్రాంతంలో సముద్రపు అలలు 3 నుంచి 3.5మీ. ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉందని... కాబట్టి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తీర ప్రాంతం వెంబడి గంటకు 45 నుంచి 55కి.మీ మేర వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని... లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు తెలిపారు.
విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... అల్ప పీడన ప్రభావంతో ఆగస్టు 13వ తేదీన విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఆగస్టు 14వ తేదీన విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఆగష్టు 15వ తేదీన విశాఖ, తూర్పు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఆగష్టు 16వ తేదీన విశాఖ, తూర్పు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.