AP weather: రాగల మూడు రోజులపాటు ఏపీలో ఉరుములు మెరుపులతో వర్షాలు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. ఏపీలోనూ జోరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి.

ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు
కాగా, ఏపీలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశముందని హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు తెలిపింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్లో దక్షిణ, ఆగ్నేయ గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ మంగళవారం పేర్కొంది.

ఉత్తరకోస్తాలో తేలికపాటి వర్షాలు
ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో మంగళవారం తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
దక్షిణ కోస్తా ప్రాంతంలో మంగళవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుముల తో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో మంగళ, బుధ, గురువారాల్లో తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.