రెచ్చగొట్టం: మైసూరా రెడ్డి, ఎలా ఓదార్చాలో: విజయమ్మ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యత కోసం ఏం చేస్తున్నారో తెలియదన్నారు. ఆయన సమైక్యవాదినని మాత్రం ప్రకటించుకున్నారని ఎద్దేవా చేశారు. 74 రోజులుగా ఉద్యోగులు ఉద్యమిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. అధిష్టానం ఆడిస్తున్న నాటకంలో భాగంగా ముఖ్యమంత్రి ఉద్యోగుల సమ్మెను క్రమంగా విరమింప చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు చేస్తున్న సమ్మె గొప్పదన్నారు. అయితే ఫైలిన్, ఇతర కారణాలు చూపి పథకం ప్రకారం వారి సమ్మెను విరమింప చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కనుసన్నుల్లో ముఖ్యమంత్రి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ సభకు పోలీసులు వద్దన్నా న్యాయస్థానం పచ్చజెండా ఊపిందన్నారు. తమ సభకు అనుమతి రావడం ప్రజా విజయమని ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.
ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు: వైయస్ విజయమ్మ
పైలిన్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఏవిధంగా ఓదార్చాలో అర్థం కావడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ శ్రీకాకుళం జిల్లాలో అన్నారు. ఆమె బుధవారం జిల్లాలోని కవిటి తదితర మండలాలలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తుఫాను కారణంగా రైతులకు అపార నష్టం జరిగిందన్నారు. ధ్వంసమైన తోటలను చూసి రైతులను ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదన్నారు.
రైతులకు ఎకరా లెక్కన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి పూర్తిగా రుణమాఫీ చేయాలన్నారు. ఇందుకోసం తమ పార్టీ పోరాడుతుందన్నారు. మత్స్యకారులకు గతంలో జగన్ హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే వాటిని తీర్చుతారన్నారు. తుఫాను బాధితులను ఆదుకోవాలని తమ పార్టీ ఎమ్మెల్యేలమంతా నివేదిక ఇస్తామన్నారు. విజయమ్మ బాధితులను పరామర్శించారు. పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు.