ఎపి:రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకోనుందా?...ప్రభుత్వం అప్రమప్తం
అమరావతి:ఆంధ్రప్రదేశ్ కరువు కోరల్లో చిక్కుకోనుందా?...అంటే అవుననేలాగే కనిపిస్తున్నాయి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు. ఇందుకు ప్రధాన కారణం ఇప్పటివరకు నమోదవ్వాల్సిన దానికంటే తక్కువగా వర్ష పాతం నమోదవ్వడమే.
రాష్ట్రంలో ఇప్పటికే సాగు ఆరంభించిన వారి సంఖ్య ఎంత?...వారి ప్రస్తుత పరిస్థితి ఏంటి?...వీటిపై రాష్ట్రప్రభుత్వం వద్దనున్న లెక్కలేంటి?...రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైంది?... తదిదర వివరాలన్నీ క్రోడీకరిస్తే ఏపీని కరువు మేఘాలు కుమ్ముకోనున్నట్లుగా తేటతెల్లం అవుతోంది. ఈ ఖరీఫ్ సీజన్లో జులై చివరి వరకు సాధారణ వర్షపాతం కంటే 13 శాతం వర్షపాతం నమోదైంది.
జులైలో 247.9 మి.మీ. నమోదు కావాల్సి ఉండగా 215.5 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవడం కొంత ఊరట కలిగిస్తోంది. మరోవైపు రామలసీమ నాలుగు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదయింది. అన్నింటిలోనూ కడప జిల్లాలో అత్యల్పంగా వర్షపాతం నమోదు అయినట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. ఇక ఈ ఖరీఫ్లో పంట సాగు విస్తీర్ణం కూడా బాగా తగ్గినట్లు తెలుస్తోంది.
అడవుల నరికివేత, వాతావరణ మార్పులవల్ల వర్షాలు తగ్గుతున్నాయి. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో కనీసం 39.53లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉండగా కేవలం 19.14 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు జరిగింది. ఆగస్టు నెలలోనూ వర్షపాతం అంత ఆశాజనకంగా లేదు. దీంతో ప్రస్తుతం వేసిన పంటలను రక్షించుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచించింది.
దేశంలో అత్యధికంగా వ్యవసాయ ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. సాగుకు రాష్ట్రంలో భారీగా నీటి వినియోగం జరుగుతోంది. అయితే సంప్రదాయ సాగు పద్ధతుల కారణంగా నీరు వృథా అవుతోంది. భూగర్భ జలాలను అధికంగా వాడేస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నీటి వినియోగ సామర్థ్యం 33 శాతం మాత్రమే. సాగు భూమి పెరిగిన కొద్దీ నీటి దుర్వినియోగం కూడా పెరుగుతోందనేది వ్యవసాయ రంగ నిపుణుల అభిప్రాయం.
రాష్ట్రంలో తాగునీటి సరఫరా సరిగ్గా లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నీటి సంరక్షణ మిషన్ చేపట్టింది. వాననీరు, ఉపరితల నీటి ప్రవాహాలు, భూగర్భ జలాలను సంరక్షించి, వాటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుని, సముద్రం పాలు కాకుండా కాపాడుకునేలా చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో సాగునీరు, అటవీ, గ్రామీణాభివృద్ధి, భూగర్భ జల విభాగాలు భాగం కావాలి. రాష్ట్ర నీటి నిర్వహణలో వ్యవసాయం, పశు సంవర్థక, ఉద్యానవన, మత్స్య, గ్రామీణ, పట్టణ నీటి సరఫరా విభాగాలు పాలుపంచుకోవాలని వారు సూచిస్తున్నారు.