తెలుగు మహిళకు అరుదైన గౌరవం: రాష్ట్రపతి చేతుల మీదుగా నారీశక్తి పురస్కారం అందుకున్న భూదేవి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే నారీశక్తి పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం ఢిల్లీలో ఘనంగా జరిగింది.
Recommended Video
పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలను కేంద్ర ప్రభుత్వం నారీశక్తి పురస్కారంతో సత్కరించింది. 2019 సంవత్సరానికి గానూ పలువురు మహిళలకు నారీశక్తి పురస్కారాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందజేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళంకు చెందిన పడాల భూదేవి నారీశక్తి పురస్కారం అందుకున్నారు.
1996లో తన తండ్రి స్థాపించిన ఆదివాసి వికాస్ సొసైటీ ద్వారా గిరిజన మహిళలు, వితంతువులు, పోడు భూముల అభివృద్ధికి చేస్తున్న కృషికి గానూ భూదేవి ఈ పురస్కారం అందుకున్నారు.
భూదేవితోపాటు బినా దేవి, అరిఫ్ జాన్, చామి ముర్ము, నిల్జా వాంగ్మో, కళావతి దేవి, రష్మీ ఉర్దువర్దేశి, మన్ కౌర్, కౌషికి చక్రవర్తి, అవని చతుర్వేది, భవనకాంత్, మోహనసింగ్, భగీరథి అమ్మ, కార్తియాని అమ్మ ఈ పురస్కారాలు అందుకున్నారు. ఈ పురస్కారాల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తోపాటు ఆయన సతీమణి సవితా కోవింద్, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ ఉన్నారు. ఏపీకి చెందిన భూదేవికి ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#WATCH Live from Delhi: Prime Minister Narendra Modi interacts with 'Nari Shakti Puraskar' awardees. #WomensDay (Courtesy: DD) https://t.co/ZkRYXxvV8h
— ANI (@ANI) March 8, 2020
నారీశక్తి అవార్డులు అందుకున్న మహిళలతో ముఖాముఖి మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ. వారు సాధించిన విజయాలను, ఎదుర్కొన్న ఒడిదుడుకులను ప్రధానితో పంచుకున్నారు మహిళలు. ఈ సంధర్బంగా ప్రధాని వారిని అభినందించారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలు చూస్తుంటే గర్వంగా ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.