పురుష కమీషన్ వేయాలి:మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: టివి సీరియళ్లపై ఏపీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. డైలీ సీరియల్స్ ప్రభావంతో మహిళల్లో క్రూరత్వం పెరిగిపోతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే పురుష కమిషన్ ఏర్పాటు చేయాల్సి వస్తుందన్నారు.
ఇటీవలి కాలంలో కొందరు మహిళలు కూడా ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని భర్తలను కిరాయి గుండాలతో హతమారుస్తున్నారని నన్నపనేని అన్నారు. మహిళలు ఈ విదమైన దారుణాలకు పాల్పడటం వెనుక కొన్ని చానల్స్లో వచ్చే డైలీ సీరియల్స్ ప్రభావం ఎంతో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సీరియల్స్ చాలా దారుణంగా ఉంటున్నాయన్నారు.
ఈ సీరియళ్లలో ఎక్కువగా మహిళలే విలన్ పాత్రలు పోషిస్తున్నారని...అదేంటో తనకు అర్థం కావడం లేదన్నారు. ఈ సీరియళ్లలో మనుషులను ఎలా చంపాలో కూడా వివరంగా చూపిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పురుష కమిషన్ కూడా వేయాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు.
మరోవైపు మహిళలపై జరుగుతున్నదాడులు, డైలీ సీరియళ్ల ప్రభావం విషయమై నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ఇలాంటి వాటిని సమాజం పట్టించుకోవాలని, చట్టాలు గట్టిగా ఉండాలని ఆకాంక్షించారు. అంతేకాదు చట్టుపక్కల ఏం జరుగుతుందనేది ఇరుగు పొరుగువారు కూడా గమనించాలని విన్నవించారు. ఆత్మ, ప్రాణ, మాన రక్షణ కోసం మహిళలు పోలీసులు వచ్చే వరకు ఎదురు చూడకుండా తనను తాను రక్షించుకోవడం కోసం ఎదురుదాడి చేయాల్సిందేనన్నారు.
మహిళలు తమపై లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తిపై ఖచ్చితంగా దాడి చేయాలని, తప్పనిసరిగా ఆయుధం తీసుకుని తిరగబడాల్సిందేనని నన్నపనేని సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ఆమె వివరించారు.