అచ్చెన్న అరెస్టును నిరసిస్తూ గళమెత్తిన బీజేపీ నాయకులపై వేటు: అధ్యక్షుడు అలా.. క్యాడర్ ఇలా
గుంటూరు: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈఎస్ఐ మందులు, ఇతర వైద్య పరికరాల కొనుగోళ్లలో కుంభకోణానికి పాల్పడిన ఆరోపణలపై అరెస్టయిన కార్మికశాఖ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ గళమెత్తిన కొందరు బీజేపీ నేతలపై వేటు పడింది. క్రమశిక్షణా చర్యల కింద వారిపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరికి షోకాజ్ నోటీసులను జారీ చేయగా.. మరొకరిని ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది రాష్ట్రశాఖ.
ఈఎస్ఐలో కుంభకోణానికి పాల్పడినన అచ్చెన్నాయుడును అరెస్టు చేయడం సరైన చర్యేనంటూ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా పలువురు అగ్ర నాయకులు స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన వారెవరైనా, ఏ స్థాయిలో ఉన్నా అరెస్టు చేయాల్సిందేనని, ఈ విషయంలో తాము ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నామంటూ కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీ వైఖరి ఏమిటనేది ఆయన తేల్చేశారు.
దీనికి భిన్నంగా కొందరు నాయకులు వ్యవహరించారు. అచ్చెన్నాయుడి అరెస్టు సబబు కాదని, దాన్ని కక్షపూరక, ప్రతీకార చర్యగా.. అభివర్ణించారు. ఒకట్రెండు టీవీ ఛానళ్ల డిబేట్లలోనూ పాల్గొన్నారు. అచ్చెన్నాయుడి అరెస్టును బహిరంగంగా తప్పుపట్టారు. దీనిపై బీజేపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడే అచ్చెన్నాయుడి అరెస్టుకు అనుకూలంగా ప్రకటన ఇవ్వగా.. క్యాడర్ మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తించడం పట్ల అసహనానికి గురయ్యారు.
పార్టీ సిద్ధాంతానికి, నిబంధనలకు విరుద్ధంగా వారు మాట్లాడినట్లు తీర్మానించారు. లక్ష్మీపతి రాజాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నిబంధనలు అతిక్రమించిన కారణంగా లక్ష్మీపతి రాజాపై శనివారం వేటు పడింది. బీజేపీ విజయవాడ లోక్సభ ఇన్ఛార్జి కిలారు దిలీప్, రామకోటయ్యలకు కూడా షోకాజ్ నోటీసులను జారీ చేశారు. 15 రోజుల్లోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు.
Recommended Video
టీవీ ఛానళ్లలో నిర్వహించే డిబేట్లలో పాల్గొనడానికి, పార్టీ గొంతుకను వినిపించడానికి కొందరు నాయకులను బీజేపీ ఎంపిక చేసింది. వల్లూరి జయప్రకాశ్ నారాయణ, నాగోతు రమేశ్ నాయుడు, షేక్ బాజీ, లంకా దినకర్ మాత్రమే మీడియా డిబేట్లలో పాల్గొనాలని పేర్కొంది. దీనికి భిన్నంగా రామకోటయ్య, లక్ష్మీపతి రాజా, కిలారు దిలీప్ మీడియా చర్చల్లో పాల్గొన్నారు. రామకోటయ్య, కిలారు దిలీప్.. పార్టీ సిద్ధాంతానికి భిన్నంగా అచ్చెన్నాయుడు అరెస్టును నిరసించారు. జగన్ ప్రభుత్వం ప్రతీకార చర్యల్లో భాగంగా ఆయనను అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు.