జనసేనపై రఘువీరా ఇంట్రెస్టింగ్ కామెంట్స్: అవి సగం సినిమాలు అంటూ టీడీపీ-వైసీపీకి సవాల్
అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన కీలకంగా మారనుందని అందరూ భావిస్తున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపుతుందనేది చాలామంది అభిప్రాయంగా ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే ఏ పార్టీకి మెజార్టీ రాకపోవచ్చునని, అప్పుడు జనసేన చక్రం తిప్పే అవకాశాలున్నాయని అంటున్నారు.
రఘువీరా ఆసక్తికర వ్యాఖ్యలు
జనసేన ప్రభావాన్ని దాదాపు ఎవరూ తక్కువగా అంచనా వేయడం లేదు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతుతో గెలిచామని కొత్తలా టీడీపీ చెప్పింది. జనసేనాని వల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని లేదంటే తాము గెలిచేవాళ్ళమని వైసీపీ కూడా చెప్పిన సందర్భాలు ఎన్నో. కానీ కాంగ్రెస్ ఏపీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మొలకెత్తని విత్తనం
జనసేన పార్టీ ఇంకా మొలకెత్తని విత్తనం అని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎలా ఉంటుందని మీడియా ప్రశ్నించగా ఆయన పైవిధంగా సమాధానం చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఏపీ భవిష్యత్తు ఆధారపడి ఉందని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పారు.
వైయస్, ఎన్టీఆర్ బయోపిక్లపై
ఆయన ఓ విధంగా తెలుగుదేశం పార్టీకి కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాపై స్పందించారు. తొలి పార్ట్ మాత్రమే కాదని, రెండో పార్ట్ కూడా తీయాలని డిమాండ్ చేశారు. అలాగే, జగన్ పార్టీ వాళ్లు యాత్ర సినిమా తీస్తున్నారని 'యాత్ర' గురించి ప్రస్తావించారు. వైయస్ రాజశేఖర రెడ్డి అసలు ఎప్పుడైనా వైసీపీలో సభ్యుడా కాదా చూపించాలని డిమాండ్ చేశారు. వైయస్ ఎప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేవరకు కాంగ్రెస్ నిద్రపోవద్దని వైయస్ కోరుకునేవారని, వారికి నిజాయితీ ఉంటే అది చూపించాలని డిమాండ్ చేశారు. ఎన్డీఆర్ బయోపిక్ అయినా, వైయస్ బయోపిక్ అయినా సగం సగం చూపిస్తే ఎలాగని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసం కాకుండా వారు పూర్తిగా చనిపోయే వరకు తీయాలన్నారు.