బీహార్లో బీజేపీ ఓడితే 8న ఏపీలో దీపావళి చేసుకుంటాం: రఘువీరా
అమరావతి: బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడితే నవంబర్ 8న దీపావళి చేసుకుంటామని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
ఇటీవల వారణాసి స్థానిక ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 స్ధానాలు మాత్రమే గెలిచి 50 స్థానాల్లో ఓటమి పాలైందన్నారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దత్తత తీసుకున్న జయపూర్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసిందన్నారు. వరంగల్ ఉపఎన్నికలో భాగంగా ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా ప్రచారం చేస్తామన్నారు.
బెజవాడ బీజేపీ ఆఫీస్పై దాడి చేసిన విద్యార్థులకు రిమాండ్
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడలోని బీజేపీ ఆఫీస్పై దాడి చేసిన విద్యార్థులను సోమవారం రిమాండ్కు తరలించారు. నలుగురు విద్యార్థులకు ఈనెల 16 వరకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. బీజేపీ ఆఫీసుపై దాడి చేయడంతోపాటు అనుమతి లేకుండా ప్రవేశించి అక్కడ ఆస్తులు ధ్వంసం చేసినట్లు వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.
వివరాల్లోకి వెళితే.... ఆదివారం సాయంత్రం బీజేపీ ఆఫీస్ వద్ద ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు విద్యార్ధులు యత్నించారు. ఆ సమయంలో అక్కడ సమావేశం జరుగుతుండటంతో బీజేపీ కార్యకర్తలు విద్యార్థులను అడ్డుకుని వారిపై దాడి చేశారు.
ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులను స్టేషన్కు తీసుకువెళ్లారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తామని చెప్పి, విడిచిపెట్టకుండా విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. దీంతో సోమవారం కోర్టు వారికి ఈ నెల 16 వరకు రిమాండ్ విధించింది. విద్యార్థులకు మద్దతుగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ సీఎం కార్యాలయానికి ముట్టడించేందుకు వస్తున్న నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.