రాజకీయాలకు దూరం: తిరుమలలో పీసీసీ చీఫ్ రఘువీరా
తిరుమల: మాజీ మంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి బుధవారం తిరుమలకు చేరుకున్నారు. ఈ ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. మొక్కులను చెల్లించారు. స్వామివారికి తలనీలాలను సమర్పించారు. అనంతరం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) సంకీర్ణ కూటమి పతనంపై అభిప్రాయాన్ని తెలపాలని విలేకరులు ప్రశ్నించగా.. ఆయన నిరాకరించారు. రాజకీయ పరమైన ప్రశ్నలను అడగొద్దని కోరారు. ఆరు నెలల పాటు తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు.
దేశ, రాష్ట్ర రాజకీయాలు, ఆయా చోట్ల అధికారంలో ఉన్న పార్టీల పరిపాలన వంటి అంశాలపై తానేమీ స్పందించనని చెప్పారు. తన స్వగ్రామం అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో ఆలయాన్ని నిర్మిస్తున్నానని, ప్రస్తుతం తన దృష్టి అంతా ఆలయ నిర్మాణం మీదే ఉందని అన్నారు. భక్తి శ్రద్ధలతో, చిత్తశుద్ధితో ఆలయాన్ని నిర్మించాల్సి ఉందని, విమర్శలు చేయడానికి, ఆరోపణలను సంధించడానికి ఇది సమయం కాదని అన్నారు.
దక్షిణాదిన కాంగ్రెస్ పరిస్థితేంటీ? ఇప్పట్లో తేరుకోగలదా?
ఈ కారణం వల్లే తాను ఆరు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వస్తోందని చెప్పారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రఘువీరా రెడ్డి తన పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ రాజీనామాను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అంగీకరించలేదు.