'నెక్స్ట్ సీఎం'పై కీలకవ్యాఖ్యలు: ముగ్గురిలో ముఖ్యమంత్రి ఎవరు, తేల్చేది ఢిల్లీ లెక్క?
గుంటూరు: 2019 లోకసభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎన్నికల బరిలో ప్రధానంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఉండనున్నాయి. అయితే ప్రధానమైన పోటీ మాత్రం మొదటి మూడు పార్టీల మధ్యే ఉండనుంది.
మూడు పార్టీల మధ్యే పోటీ
2014లో టీడీపీ, వైసీపీ మధ్యే హోరాహోరీ ఉంది. నాటి పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు. అప్పుడు టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతిచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందువల్ల నాడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేసి కనీసం ఒక్కచోట గెలవలేదు. పైగా దాదాపు అన్ని చోట్ల డిపాజిట్ గల్లంతయింది. ఇప్పుడు పరిస్థితులు భిన్నం. ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ చేస్తున్నాయి.
కఠిన షరతులతో జనసేనాని మద్దతు?
టీడీపీ, వైసీపీ, జనసేన మధ్యే కీలక పోరు కనిపించనుంది. టీడీపీ, వైసీపీలు అధికారం కోసం పోటీ పడితే, జనసేన అందులో కీలకంగా వ్యవహరించే పరిస్థితులు రావొచ్చునని భావిస్తున్నారు. కర్ణాటకలో తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు ఏపీలోనూ రావొచ్చుననే చర్చ కూడా సాగింది. అయితే, అంతగా కాకపోయినప్పటికీ.. టీడీపీ, వైసీపీలకు సరైన మెజార్టీ రాకుంటే జనసేన కఠిన షరతులపై మద్దతిచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
కాంగ్రెస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఇలాంటి పరిస్థితుల్లో ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సోమవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో నవ్యాంధ్రలో కాంగ్రెస్ పార్టీ కీలకం కానుందని చెప్పారు. తమ మద్దతుదారులే ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటారని ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా హామీని కూడా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ... రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ లక్ష్యమని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి చెప్పారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం దురదృష్టకరమని చెప్పారు. ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో కోట్ల ఇమడటం చాలా కష్టమని చెప్పారు. కోట్ల తెలుగుదేశం పార్టీలో చేరితే విజయభాస్కర రెడ్డి ఆత్మక్షోభిస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దుష్టపాలనను అంతం చేయడమే తమ ఫ్రంట్ లక్ష్యమని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు కలిసి జాతీయస్థాయిలో ఓ ఫ్రంట్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిని ఉద్దేశించి రఘువీరా రెడ్డి చెప్పారు. మోడీ దుష్టపాలను అంతమొందించడం ఈ ఫ్రంట్ లక్ష్యమని చెప్పారు.
ముగ్గురిలో ముఖ్యమంత్రి ఎవరు? కాంగ్రెస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
అయితే, తమ మద్దతుదారులే సీఎం కుర్చీలో ఉంటారని రఘువీరా చెప్పడం ఆసక్తిని రేపుతోంది. ఎందుకంటే ఏ రకంగా చూసినా ముగ్గురు... చంద్రబాబు, జగన్ పవన్ కళ్యాణ్లు దగ్గరివారిగా కనిపిస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి కొత్త మిత్రుడు. కానీ ఎన్నికల్లో కలిసి వెళ్లడం లేదు. జగన్ పాతకాపు.... అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టినవారు. ఇక, పవన్ కళ్యాణ్.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవికి తమ్ముడు. ఈ విషయాన్ని పక్కన పెడితే, చంద్రబాబుతో వెళ్దామని కొందరు కాంగ్రెస్ నేతలు, ఆయనతో వద్దని కొందరు నేతలు చెప్పారు. మరికొందరు... జగన్, పవన్ కళ్యాణ్లతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతుదారులు ఎవరనే చర్చ సాగుతోంది.
ఢిల్లీ లెక్కలు కీలకం
అయితే, 2019 లోకసభ ఎన్నికల్లో కేంద్రంలో యూపీఏకు వచ్చే సీట్లు, ఏపీలో ఆయా పార్టీలకు వచ్చే సీట్లపై ఆధారపడి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు వచ్చే లోకసభ ఎన్నికల్లో కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు టీడీపీ సీట్లు అవసరం పడితే, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తంగా ఇక్కడ ఆయా పార్టీ గెలిచిన సీట్లు, కేంద్రంలో యూపీఏ గెలుచుకోబోయే సీట్లపై ఇది ఆధారపడి ఉంటుందని అంటున్నారు.