Sailajanath: రాహుల్ గాంధీ దృష్టికి రాష్ట్ర వ్యవహారాలు: జగన్ సర్కార్ వైఖరిపై ప్రజా పోరాటం..!
న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలను స్వీకరించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకె శైలజానాథ్.. హస్తిన పర్యటనలో ఉన్నారు. పార్టీ సీనియర్ నేత, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మాజీ అధినేత రాహుల్ గాంధీని మర్యాదపూరకంగా కలిశారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత.. ఆయన రాహుల్ గాంధీతో భేటీ కావడం ఇదే తొలిసారి.
రాష్ట్ర రాజకీయాలపై..
ఈ సందర్భంగా ఆయన వెంట- కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఊమెన్ చాంది, కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ఎన్ తులసీరెడ్డి, మస్తాన్ వలి తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు పూర్వవైభవాన్ని కల్పించడానికి తీసుకోవాల్సిన పలు అంశాలపై వారి మధ్య చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు, మూడు రాజధానుల ఏర్పాటు వంటి కీలక అంశాలపై పార్టీ వైఖరి ఎలా ఉండాలనే విషయంపై చర్చించినట్లు చెబుతున్నారు.
సొంత గూటికి పిలిపించడమే ప్రధాన టాస్క్..
రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ గుడ్బై చెప్పిన నాయకులను సొంత గూటికి పిలిపించుకోవడానికి చర్యలను చేపట్టాలని రాహుల్ గాంధీ సూచించినట్లు తెలుస్తోంది. దశాబ్దాల కాలం పాటు పార్టీలో ఉంటూ, పదవులను అనుభవించిన నాయకులు.. కష్టకాలంలో కాంగ్రెస్ను వీడి వెళ్లడం సరైంది కాదని, అలాంటి వారిని మళ్లీ వెనక్కి పిలిపించుకోవడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆయన శైలజానాథ్కు సూచించినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల్లోకి వెళ్లిన తరువాత.. నిరాదారణకు గురవుతున్న వారిని పిలిపించుకోవాలని సూచించారని అంటున్నారు.
పార్టీ బలోపేతంపై
విభజన అనంతరం రాష్ట్రంలో దాదాపు కనుమరుగైన స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవింపజేయడానికి తక్షణ చర్యలను చేపట్టాల్సి ఉంటుందని, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి దశలవారీగా ప్రజా పోరాటాలకు సిద్ధపడాల్సి ఉందని శైలజానాథ్.. రాహుల్ గాంధీకి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటోందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు.
మూడు రాజధానుల ఏర్పాటుపై..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తోన్న విషయాన్ని శైలజానాథ్ తదితరులు.. రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. మూడు రాజధానులను వ్యతిరేకమనే విషయాన్ని తాము ఇదివరకే సూచనప్రాయంగా వెల్లడించామని విషయాన్ని పీసీసీ నేతలు.. రాహుల్ గాంధీకి వివరించారని అంటున్నారు. పరిపాలనను వికేంద్రీకరించడం వల్ల ఉపయోగం ఉండబోదని, అభివృద్ధిని వికేంద్రీకరించాల్సి ఉంటుందనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు.
తెలుగుదేశం పార్టీతో సీట్ల సర్దుబాటు..
గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సమయానికి ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాహుల్ గాంధీని కలిసిన విషయం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చిందని సమాచారం. భవిష్యత్తులో పార్టీ ఎదుర్కొనబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రత్యర్థిగానే భావించాలని రాహుల్ గాంధీ వారికి సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జన సమితిలతో కలిసి మహా కూటమిగా ఏర్పడినప్పటికీ.. ఆశించిన ఫలితాలు రాలేదు. దీనితో ఏపీలో భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాల్సి ఉంటుందని రాహుల్ గాంధీ సూచించినట్లు తెలుస్తోంది.