కాంగ్రెస్ సస్పెండ్ చేసింది, వెంకయ్య సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ సీఎం తనయుడు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్ నేత నేదురమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు.. ఏపీసీసీ జనరల్ సెక్రటరీ నేదురమల్లి రామ్కుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రకటించారు.
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందునే రామ్ కుమార్ రెడ్డిని సస్సెండ్ చేసినట్లు ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాకు చెప్పారు.
బీజేపీలో చేరిన నేదుమల్లి తనయుడు రామ్ కుమార్ రెడ్డి
దివంగత మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి ఆదివారం బీజేపీలోచేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన రామ్ కుమార్ రెడ్డి, బీజేపీ చేరతారనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్న విషయం తెలిసిందే.
నెల్లూరులో ఓ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడి సమక్షంలో రామ్ కుమార్ రెడ్డి కషాయ తీర్ధం పుచ్చుకున్నారు. రామ్ కుమార్తో పాటు ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, విభజన సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.