డ్రామాలు కట్టిపెట్టు, ప్రత్యేక హోదా తీసుకురా: విశాఖ భాగస్వామ్య సదస్సుపై రఘువీరా
అమరావతి: కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్నా సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్లోని ఇందిరాభవన్లో ఆయన మాట్లాడారు.
చంద్రబాబును చూస్తుంటే నీరో చక్రవర్తి గుర్తుకు వస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు సమస్యల్లో ఉంటే ముఖ్యమంత్రి మాత్రం కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. సాగునీరు లేక రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు టైంపాస్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సాగునీటి ప్రాజెక్టులు కట్టాలంటే సెక్షన్ 84 కింద కేంద్ర జలవనరులు సంఘం అనుమతి ఉండాలని, కేంద్ర జలవనరుల శాఖ సిఫారసు అయినా ఉండాలని తెలిపారు. తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులపై చంద్రబాబు అభ్యంతరం చెప్పకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందన్నారు.
గతంలో చంద్రబాబు విజన్ 2020 అన్నాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారం ముగిసేలోగా లక్ష కోట్లుతెస్తానని చెప్పిన చంద్రబాబు లక్ష రూపాయలు కూడా రాష్ట్రానికి తేలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటున్నాడని ఇదంతా భోగస్ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఏమైందని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదాతో కూడిన రాయతీలు వస్తే, మీరీ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం లేదని, రాయతీలు వస్తే పెట్టుబడులు వాటంతట అవే వస్తాయని ఆయన తెలిపారు.
డ్రామాలు కట్టిపెట్టాలని ఆయన సీఎం చంద్రబాబుకు సూచించారు. కేవలం టీవీ, వార్తా పత్రికల కవరేజ్ కోసం కార్యక్రమాలు చేయవద్దని ఆయన సూచించారు. విజన్ 2020 లా విజన్ 2050 ప్రవేశపెడుతున్నారని, ఇవన్నీ ప్రజలు వినేసిన పాతకథలని ఆయన పేర్కొన్నారు.
విశాఖలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రానికి రూ. 2 లక్షలు కూడా రావని చెప్పారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని చంద్రబాబుకు చేతనైతే ప్రత్యేకహోదా తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.