రోజా ఎట్టకేలకు మౌనం వీడారు : సీఎం జగన్..చంద్రబాబు మధ్య పోలికతో : లోకేశ్ మీద ఫైర్..!!
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా చాలా రోజుల తరువాత తన సహజ శైలిలో స్పందించారు. కొద్ది రోజులుగా మౌనంగా ఉంటున్న రోజా తిరిగి చంద్రబాబు..లోకేశ్ మీద ఫైర్ అయ్యారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ .. చంద్రబాబు మధ్య పోలికతో సెటైర్లు వేసారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో బెర్తు లేకపోవటంతో ఆవేదనకు గురైన రోజాకు ముఖ్యమంత్రి కీలకమైన నామినేటెడ్ పదవిని కట్టబెట్టారు. దీంతో..రోజా యాక్టివ్ అయ్యారు. శాసనసభలో..బయటా గతంలో లాగా ఫైర్ బ్రాండ్ లా కాకుండా.. సందర్భానుసారం వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తన ఇంటికి ఆహ్వానించి విందు ఇచ్చారు. ఇక..తాజాగా ముఖ్యమంత్రి నిర్వహించిన పరిశ్రమల సమీక్షలో పాల్గొన్నారు. ఇప్పుడు, చాలా గ్యాప్ తరువాత చంద్రబాబు..లోకేశ్ మీద వ్యంగాస్త్రాలు సంధించారు. లోకేశ్ ను చూస్తే ఏడవాలో..నవ్వాలో అర్దం కావటం లేదని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు ఎందుకు అంత భయం..
టీడీపీ నేతలు పార్టీ ఉనికి కోసమే ప్రభుత్వం పైన బురద జల్లుతోందని వైసీపీ ఎమ్మెల్యే..ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ఫైర్ అయ్యారు. డ్రోన్ కెమెరాలంటే చంద్రబాబుకు ఎందుకు అంత భయం అని ప్రశ్నించారు. జగన్ పాదయాత్రలో పోలీసులు డ్రోన్లు ఉపయోగించినప్పుడు తప్పు అని చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. సీఎం హోదాలో అక్రమ కట్టడంలో ఉన్నందుకు చంద్రబాబు సిగ్గుపడాలి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ఎవరూ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ ప్రజలే చంద్రబాబును టార్గెట్ చేసి ఇంటికి పంపారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శలపైన రోజా తీవ్రంగా స్పందించారు. లోకేశ్ పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. లోకేష్ను చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. రోజా రెండో సారి ఎమ్మెల్యే అయిన తరువాత..వైసీపీ అధికారం లోకి రావటంతో తనకు మంత్రి పదవి ఖాయమని భావించారు. అయితే, మంత్రివర్గ విస్తరణ ముందు రోజు సాయంత్రం రోజాకు మంత్రివర్గంలో స్థానం లేదని ఖరారైంది. ఆ వెంటనే మంత్రివర్గ విస్తరణకు సైతం హాజరు కాకుండా రోజా హైదరాబాద్ వెళ్లిపోయారు. మంత్రి పదవి దక్కకపోవటంతో ఆవేదనకు గురయ్యారు. అప్పటి నుండి తన సహజ శైలికి భిన్నంగా విమర్శలకు..ఆరోపణలకు దూరంగా ఉంటున్నారు.
కొద్ది రోజులుగా మౌనం పాటిస్తూ..
మంత్రి పదవి దక్కకపోవటంతో ఆవేదనలో ఉన్న రోజాకు ముఖ్యమంత్రి జగన్ పిలిచి కీలకమైన నామినేటెడ్ పదవి అప్పగించారు. ఏపీఐఐసీ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఆ పదవి బాధ్యతల స్వీకరణ సైతం రోజా నిరాడంబరంగా నిర్వహించారు. ఇక, గత శాసనసభలో..ఇప్పటి శాసనసభలో రోజా వ్యవహార శైలికి చాలా తేడా ఉంది. ప్రతిపకక్ష సభ్యురాలిగా ముఖ్యమంత్రి చంద్రబాబును నాడు లక్ష్యంగా చేసుకొని ఫైర్ అయ్యేవారు. ఇక, ఇప్పుడు మాత్రం సభలో తనకు అప్పగించిన అంశాల మీద మాత్రమే స్పందిస్తున్నారు. చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పి..ఎటువంటి వివాదాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, రోజా కొద్ది రోజులుగా మౌనం పాటిస్తున్నారు. తాను ఎక్కడ ఉంటే అక్కడ చంద్రబాబు లేదా లోకేశ్ పైన విరుచుకుపడుతూ విమర్శలు చేసే రోజా..కామ్ అయిపోయారు. చాలా రోజుల తరువాత తిరిగి తిరుపతిలో ఇప్పుడు తన సహజ శైలిలో స్పందించారు.
కేసీఆర్ కు విందు తరువాత...
రోజా తెలంగాణ ముఖ్యమంత్రికి కొద్ది రోజుల క్రితం ఘన స్వాగతం పలికారు. కాంచీపురం వెళ్తున్న సమయంలో నగరిలో తన నివాసం ముందు నుండి వెళ్తున్న కేసీఆర్ కు అపూర్వ స్వాగతం ఇచ్చారు. కేసీఆర్ కుటుంబంతో కలిసి కాంచీపురం వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిని తన ఇంటికి విందుకు ఆహ్వానించారు. అక్కడ కేసీఆర్ కు గులాబీ పూల మీద నడింపించి ఇంట్లోకి తీసుకెళ్లారు. అనేక వంటకాలతో కేసీఆర్ కుటుంబానికి విందు ఇచ్చారు. కేసీఆర్ పైన రోజా టీడీపీలో ఉన్న సమయంలో అనేక ఆరోపణలు చేసారు. అవన్నీ మర్చిపోయి అభిమానంతో కేసీఆర్ కు విందు ఏర్పాటు చేసారు. కేసీఆర్ సైతం రోజాను తన కుమార్తెగా అభివర్ణించారు. దీని ద్వారా..ఇటు ఏపీ ముఖ్యమంత్రికి సోదరిగా..తెలంగాణ ముఖ్యమంత్రికి కుమార్తెగా రోజా మారిపోయారు. దీంతో పాటుగా గతంలో రోజా తీరు మీద ఉన్న విమర్శలకు మరో సారి అవకాశం లేకుండా చాలా రిజర్వ్ గా ఉంటూ రోజా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు వైసీపీలో నే చర్చకు కారణమైంది.