నెల్లూరుకు వస్తారనుకుంటే.. కలాంను రాష్ట్రపతి చేయడంలో నా పాత్ర కూడా: వెంకయ్య
హైదరాబాద్: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణవార్త తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. కాకతాళీయంగా సోమవారం మధ్యాహ్నామే ఆయనతో మాట్లాడానని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు.
ఆగస్టు 17న నెల్లూరులో స్వర్ణభారతి ట్రస్టులో నిర్వహించే కార్యక్రమానికి తన కూతురు దీప్తి కోరిక మేరకు కలామ్ను ఆహ్వానించామని, అందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. మరోసారి ఆయన అపాయింట్ మెంట్ ఖరారు చేసుకుందామనుకునే లోపే ఆయన కన్నుమూయటం కలచివేసిందని పేర్కొన్నారు.
కలలు కని, వాటిని నిజం చేయడమే భారత మాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాంకు నిజమైన ఘన నివాళి అర్పించడమని ఆయన తెలిపారు. ప్రజల రాష్ట్రపతిగా ఆయన చరితార్ధమయ్యారని ఆయన సేవలను కొనియాడారు. ఆయన చూపించిన బాటలో పయనించడమే ఆయనకు నివాళి అర్పించడమని ఆయన చెప్పారు.
అప్పట్లో రాష్ట్రపతిగా ఆయన పేరును ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించటంలో తన పాత్ర కూడా ఉందన్నారు. మంగళవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయడంలో తన పాత్ర ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
2002లో అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారు. అప్పుడు కేంద్రంలో అటల్ బిహారీ వాజపేయి సారథ్యంలోని ఎన్డీయే అధికారంలో ఉంది. అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్గా ఉన్నారు. భారత రాష్ట్రపతిగా మైనార్టీ వర్గానికి చెందిన ప్రముఖుడిని నియమించాలని వాజపేయి తీర్మానించారు.
ముగ్గురు మైనార్టీ నేతల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసి, ఎన్డీయే కన్వీనర్ హోదాలో ఉన్న చంద్రబాబుకు ఫోన్ చేశారు. జాబితాలో మూడు పేర్లలో అబ్దుల్ కలాం పేరును చంద్రబాబు ఆమోదం తెలిపారని చెబుతున్నారు.