ఎక్కడికి రావాలో చెప్పండి!: బాబుకు మురళీకృష్ణ, కీసరలో కొట్టుకున్న టిడిపి-వైసిపి
అమరావతి: రాజధాని అమరావతికి వచ్చేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని, కానీ సచివాలయం ఎక్కడ నిర్మిస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని ఏపీఎన్జీవో నేత మురళీ కృష్ణ మంగళవారం నాడు అన్నారు. ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు.
ఈ సందర్భంగా ఉద్యోగుల అభ్యంతరాలు, సమస్యల పైన మంత్రులు యనమల రామకృష్ణుడు, పి నారాయణలతో భేటీ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు సూచించారు.
అనంతరం మురళీకృష్ణ విలేకరులతో మాట్లాడారు. సచివాలయం ఎక్కడ నిర్మిస్తారో నిర్ణయించాలన్నారు. స్థానికత అంశం పైన కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, సచివాలయ నిర్మాణం పైన ప్రభుత్వం ఇప్పటికి రెండు మూడు ప్రాంతాలు ఖరారు చేసిన విషయం తెలిసిందే.
స్పీకర్ స్థానం ముళ్ల కిరీటం వంటిది: కోడెల
స్పీకర్ స్థానం ముళ్ల కిరీటం వంటిదని సభాపతి కోడెల శివప్రసాద రావు అన్నారు. ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. సభలో ప్రతి సభ్యుడు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అప్పుడే అర్థవంతమైన చర్చ జరిగి ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.
కీసరలో రసాభాస
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసరలో మంగళవారం ఉద్రిక్తత తలెత్తింది. వైసిపి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కీసరలో జన్మభూమి కార్యక్రమంలో తమను కనీసం పట్టించుకోవడం లేదంటూ వైసిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రతిగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య పరస్పర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తలు తోపులాటకు దిగారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం సాగుతుండగానే రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు కలబడి పిడిగుద్దులు కురిపించుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలపై లాఠీఛార్జ్ చేసి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.