లగడపాటిని కిందికి లాగిన టి వాది: ధర్నాలో ఉద్రిక్తత
హైదరాబాద్: ఏపిఎన్జీవోల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన మహాధర్నాలో ఉద్రిక్తత చేసుకుంది. ఉద్యోగ సంఘాలకు మద్దతు తెలుపుతూ వేదికపైకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ను అక్కడి చేరుకున్న ఓ తెలంగాణవాది కిందికి లాగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని సద్దుమణిగేలా చూశారు.
ఆ సమయంలో మీడియా ప్రతినిధులను అడ్డుకోవడంతో కొంత తోపులాట చేసుకుంది. అనంతరం లగడపాటి రాజగోపాల్ మాట్లాడారు. ఇదంతా సాధారణమేనని, శాంతియుతంగా ఉండాలని చెప్పారు. ఆరు నెలల నుంచి ఉద్యోగులు, న్యాయవాదులు ఉద్యమం కొనసాగిస్తున్నారని, వారికి సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. కాగా లగడపాటితోపాటు రాష్ట్రమంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు.
విభజన నిర్ణయానికి కారణం లేదని, ప్రజల ఆమోదం కూడా లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయంతో ప్రజల ఆగ్రహం ఎదుర్కొక తప్పదని చెప్పారు. మరో మంత్రి టిజి వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నిర్ణయం సరైనది కాదని అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుకు ఓ కారణం గానీ, ఉద్దేశం గానీ లేదని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. బిల్లు ఆమోదిస్తే తెలంగాణకు వస్తే లాభం ఏమిటని, విభజనతో జరిగే నష్టాన్ని ఏ విధంగా పూడుస్తారని ఆయన ప్రశ్నించారు.
శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై ప్రశాంత వాతావరణంలో చర్చ జరిగేలా అందరూ శాసనసభ్యులు కృషి చేయాలని ఏపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు కోరారు. సభా సమయాన్ని సభ్యులు వృథా చేయొద్దని అన్నారు. విభజన బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని, సభలో బిల్లును ఓడించాలని శాసనసభ్యులకు ఆయన సూచించారు. కాగా మహాధర్నాకు సీమాంధ్ర జిల్లాల నుంచి ఉద్యోగ సంఘాల నాయకులు, సమైక్యవాదులు తరలివచ్చారు.