భూముల స్వాధీనంపై హైకోర్టుకెక్కిన ఎపిఎన్జీవోలు
హైదరాబాద్: హైదరాబాదులోని గోపనపల్లి తమకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని తెలంగాణ ప్రభుత్వంవెనక్కి తీసుకోవడంపై ఏపీఎన్జీవో హౌసింగ్ సొసైటీ హైకోర్టును ఆశ్రయించింది. 189.11 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటూ తెలంగాణ రెవెన్యూ శాఖ జారీచేసిన జీవో 2ను సవాల్ చేస్తూ శుక్రవారం సంఘం కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏలను ప్రతివాదులుగా చేర్చారు.
2008లో అప్పటి ప్రభుత్వం ఉద్యోగుల కోసం 427 ఎకరాలు కేటాయించింది. అందులో తమసొసైటీకి 189.11 ఎకరాలు ప్రత్యేకించిందని, తమకు కేటాయించిన భూమిలో 90 ఎకరాలు ప్రైవేటు భూములు ఉన్నాయంటూ డి.నర్సింగరావు, మరికొందరు కోర్టుకెక్కారని, ఈ కేసులు సుప్రీం కోర్టు వరకు వెళ్లాయని, భూమిలో అభివృద్ధి పనులు చేయడానికి వీల్లేదని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చిందని పిటిషన్లో గుర్తు చేశారు.
ఆ కారణంగా 90 ఎకరాల్లో పనులు నిలిచి పోయాయని, మిగిలిన స్థలాన్ని సభ్యులకు కేటాయించామని, తమకు కేటాయించిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోడానికి ప్రభుత్వం నిర్ణీత గడువేదీ విధించలేదనిస పైగా గృహనిర్మాణాలకు రుణాలు వుంజూరు కావడంలోనూ జాప్యం జరుగుతోందని అన్నారు. సహేతుక కారణాలు పట్టించుకోకుండా ఈ భూములు స్వాధీనం చేసుకోవడం అన్యాయమని అన్నారు.
లే-అవుట్కోసం తగిన రుసుములు చెల్లించి జీహెచ్ఎంసీ నుంచి కూడా అనువుతి పొందామని, సభ్యులకు ఇళ్ల స్థలాలు కేటాయించామని, లే-అవుట్ అభివృద్ధికోసం సువూరు 20కోట్ల రూపాయలకు పైగా ఖర్చుచేశామని, గత ఆరేళ్లుగా భూములు ఖాళీగా ఉన్నాయంటున్న ప్రభుత్వం ఏ కారణంవల్ల పనులు జరగడం లేదనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదని అన్నారు.
తమ సొసైటీకి కేటాయించిన గోపన్నపల్లిలోనే తెలంగాణ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలకు సర్వే నెం.36, 37లలో స్థలాలు కేటాయించారని, వారుసైతం ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని తెలిపారు. ఆ భూముల జోలికి వెళ్లని ప్రభుత్వం తమపై కక్షసాధింపుకోసమే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందన్నారు.