అమ్మేయాలని: అశోక్ బాబుపై జగన్కు ఫిర్యాదు, టి ఉద్యోగులకూ ఇవ్వాలి: ఏపీఎన్జీవోలు
హైదరాబాద్: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు పైన పలువురు ఉద్యోగులు సంచలన ఆరోపణలు చేశారు. పలువురు ఏపీ ఎన్జీవో ఉద్యోగులు ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం నాడు కలిశారు.
హైదరాబాదులోని ఏపీఎన్జీవో భవన్ను అమ్మాలని అశోక్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారని వారు జగన్కు ఫిర్యాదు చేశారు. అలాగే, ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ఎన్జీవో భవన్లో తెలంగాణ ఉద్యోగులకూ వాటా ఇవ్వాలన్నారు.
ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టండి: చంద్రబాబు
నేలపై పడ్డ ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో గడచిన రెడు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయన ఏపీ అధికార యంత్రాంగంతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
భూమిపై పడ్డ ప్రతి వర్షపు చినుకును వృథాగా పోనీయకుండా ఒడిసిపట్టాలన్నారు. తద్వారా భూగర్భ జల వనరులను పెంపొందించాలన్నారు. గతంలో సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు ఇంకుడు గుంతల పథకాన్ని చేపట్టడమే కాక, నీటి పొదుపుపై భారీ ప్రచారం చేశారు.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అనంతపురం జిల్లాలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనంతపురంలోని పండమేరులో పదేళ్ల తర్వాత వరదనీరు ప్రవహిస్తోంది. కుండపోతగా వర్షాలతో 50కి పైగా చెరువులు నిండి జలకళను సంతరించుకున్నాయి.
ప్రకాశం బ్యారేజీకి వరద నీరు చేరింది. రెండువేల క్యూసెక్కుల వరద నీరు చేరికతో బ్యారేజీ నీటిమట్టం పెరిగింది. జలాశయం నీటిమట్టం 10.8 అడుగులకు చేరింది. నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వాగులు పొంగుతున్నాయి.
సుంకేశుల రిజర్వాయర్ వరద నీటితో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. వరద పోటెత్తడంతో అయిదు గెట్లు ఎత్తి.. ఇరవై వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. తుంగభద్ర డ్యాంకు భారీగా వరద నీరు చేరింది. పోలవరం కుడి కాల్వలోకి చింతమనేని ప్రభాకర్ నీటిని విడుదల చేశారు. పూజలు చేసిన అనంతరం తాత్కాలిక వెంతెనను కూడా ప్రారంభించారు.