సాయంత్రంలోగా..: చెవిరెడ్డి తీవ్రవ్యాఖ్యలపై ఉద్యోగుల ఆగ్రహం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి వ్యాఖ్యలపై ఎపిఎన్జీవోలు శుక్రవారం మండిపడ్డారు. సాయంత్రం లోగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసే బాధ్యత తమదన్నారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి వ్యాఖ్యలపై ఎపిఎన్జీవోలు శుక్రవారం మండిపడ్డారు. సాయంత్రం లోగా ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసే బాధ్యత తమది అన్నారు.
మీ ఫ్యామిలీ పశ్చాత్తాపపడేలా ప్రతీకారం: ఉద్యోగులపై చెవిరెడ్డి సంచలనం
అనవసరంగా, అన్యాయంగా అధికార పార్టీ మద్దతు ఉందని చెప్పి తమ నాయకులను ఉద్యోగులు వేధిస్తే, తాము అధికారంలోకి వచ్చాక వారి ఫ్యామిలీ పశ్చాత్తాపపడేలా ప్రతీకారం తీర్చుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై ఉద్యోగులు మండిపడ్డారు. అధికార పక్షం జులుం ప్రదర్శిస్తే అండగా ఉండాల్సిన ప్రతిపక్షం ఉద్యోగులను బెదిరించడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.
చెవిరెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఏపీఎన్జీవో అసోసియేషన్ నేత విద్యాసాగర్ అన్నారు. ఉద్యోగుల కుటుంబ సభ్యులను వివాదంలోకి లాగడం ఏమిటని ప్రశ్నించారు. చెవిరెడ్డి వ్యాఖ్యలు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని, ఆయన ఆటవిక ప్రవర్తనను సూచిస్తున్నాయన్నారు. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
చెవిరెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం సరికాదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన బెదిరింపులకు ఉద్యోగులు భయపడరన్నారు. అండమాన్ పంపించడానికి ఇప్పుడు ఉన్నవి బ్రిటిష్ ప్రభుత్వాలు కాదని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తే ఇబ్బంది పడేది వారే అన్నారు. ఉద్యోగులకు చెవిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.