రోహిత్ ఆత్మహత్య: 35 మందిని వెనక్కి నెట్టేసి వీసీ అయిన అప్పారావు
గుంటూరు: దళిత పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య సంఘటన విషయంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సియు) వైస్ చాన్సలర్ పొదిలె అప్పారావు నేపథ్యం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. రోహిత్తో పాటు అప్పారావు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా గురజాల ప్రాంతానికి చెందినవారే.
ఎప్పుడేం జరిగింది: వివాదం నుంచి రోహిత్ వేముల ఆత్మహత్య వరకు
అప్పారావుకు రాజకీయ సంబంధాలు మెండుగా ఉన్నాయని, ఆయనకు విశేషమైన మేనేజింగ్ స్కిల్స్ ఉన్నాయని హెచ్సియులోని అధ్యాపకులు అంటున్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవని ఆయన చెబుతున్నప్పటికీ ఆ రాజకీయ సంబంధాల వల్లనే ఆయన వీసి అయ్యారని చెవులు కొరుక్కుంటున్నారు.
Photos: హెచ్సియులో ఉద్రిక్తత
ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పదవి కోసం దాదాపు 35 మంది ప్రయత్నాలు చేశారు. అయితే, వారందరినీ వెనక్కి నెట్టేసి అప్పారావు వీసీ పదవిని చేపట్టారు. కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు కారణంగానే ఆయన వీసీ అయినట్లు కూడా ప్రచారంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలోని తూళ్లూరుకు చెందిన అప్పారావు గత రెండు దశాబ్దాలుగా ఈ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. 2001 నుంచి 2004 వరకు ఆయన చీఫ్ వార్డెన్గా పనిచేశారు.
అప్పారావు ఓ మాజీ పార్లమెంటు సభ్యుడికి సమీప బంధువు అని తెలుస్తోంది. ఆయన ద్వారానే అప్పారావు వెంకయ్య నాయుడికు దగ్గరయ్యాడని చెబుతారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా అప్పారావుకు సహకరించినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.