బాబు సొంత జిల్లాకు త్వరలో యాపిల్ సంస్థ: 4-5లక్షల మందికి ఉపాధి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లాకు దిగ్గజ కంపెనీ యాపిల్ రాబోతోంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబే స్వయంగా చెప్పారు. చిత్తూరు జిల్లాకు త్వరలో యాపిల్ కంపెనీ వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ కంపెనీ కంప్యూటర్లు, సెల్ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల (హార్డ్వేర్) తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ పరిశ్రమ ఏర్పాటైతే నాలుగైదు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయాక ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన టీడీపీ చిత్తూరు జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ విషయం తెలియజేశారు.
రాకెట్ల తయారీ పరిశ్రమ
చిత్తూరు జిల్లాలో రాకెట్ల తయారీ పరిశ్రమ కూడా రానుంది. 'ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్' సంస్థ ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఈ ప్రైవేటు సంస్థ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)తో కలిసి పనిచేస్తోంది. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి, రాకెట్ల ఆకృతి నిర్మాణం(రాకెట్ బాడీ) తదితర అంశాల్లో కలిసి కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తోంది. దీంతో పాటు రక్షణ రంగంలోనూ ఈ సంస్థ పలు సాంకేతిక సహకారం అందిస్తోంది.
కాగా, 'ఆకాష్' రాకెట్ల ఆకృతిని కూడా ఈ సంస్థ రూపొందిస్తోంది. తెలంగాణలోని భువనగిరి పెద్దకొండ వద్ద ఇలాంటి యూనిట్ ఉంది. ఇలా ఉండగా నెల్లూరు జిల్లాలోని సతీష్ థావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్)కు దగ్గర్లోనే రాకెట్ ఆకృతుల తయారీ యూనిట్ను నెలకొల్పాలని ఆ సంస్థ భావిస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి తన ఆసక్తిని తెలిపింది. ఈ సంస్థ ప్రతిపాదనపట్ల ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేసింది.
రాకెట్ ఆకృతుల తయారీ యూనిట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చిత్తూరు జిల్లా రౌతుసురమల వద్ద స్థలం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) ఇప్పటికే అక్కడ 202 ఎకరాల స్థలం గుర్తించింది. అయితే ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఎంతో ప్రతిష్ఠాత్మకమైంది, దేశ రక్షణ వ్యవహారాలకు సంబంధించింది కావడంతో వివరాలపై గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశాలున్నాయి.