సర్పంచుల స్ధానంలో ప్రత్యేక అధికారులు:జీవో జారీ చేసిన ఎపి ప్రభుత్వం
అమరావతి:సర్పంచ్ ల స్థానంలో స్పెషల్ ఆఫీసర్ల పాలనకే ఎపి ప్రభుత్వం మొగ్గుచూపింది. రాష్ట్రంలో సర్పంచ్ ల పదవీ కాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో వారి స్ధానంలో ప్రత్యేక అధికారులను నియమించాలంటూ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఆగష్టు రెండు నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి.
ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రకటన, సంబంధిత జి.వో.ను సైతం విడుదల చేసింది. జి.వో.యం.యస్.నెం.269 ప్రకారం ఈ ప్రకటనను గెజిట్ చేయమని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం తమ పదవీ కాలం ముగిసిన సర్పంచ్ ల స్ధానంలో ప్రత్యేక అధికారులు రానున్నారు.
సస్పెన్స్...వీడింది
రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో 12,850 చోట్ల సర్పంచ్ల పదవీకాలం ఆగస్టు 1వ తేదీతో ముగియనుంది. వీటిలో అధికారం ఎవరికి అప్పగిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొనగా తాజాగా ప్రభుత్వం జీవోతో సస్పెన్స్ వీడింది. సర్పంచ్ ల పదవీకాలం ముగింపు తేదీ దగ్గరపడిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పది నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించినా ఫలితం లేకపోయింది. ఈ ఎన్నికలకు సంబంధించి కీలకమైన రిజర్వేషన్ల అంశం తేలకపోవడంతో టీడీపీ సర్కారు ఎన్నికల వాయిదాకే మొగ్గు చూపింది.
నియామక ప్రక్రియ...ఇలా
తాజా ఉత్తర్వులు ప్రకారం పంచాయితీల బాధ్యతను స్థానిక తాసీల్దార్లు., ఎంపిడివోలు., ఎంఈఓ., పంచాయితీ రాజ్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ క్యాడర్ అధికారులకు అప్పగిస్తారు. ఆగష్టు రెండు నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. జిల్లా కలెక్టర్లు ఈ మేరకు గ్రామ పంచాయితీలకు ప్రత్యేక అధికారుల్ని తక్షణమే నియమించాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు తాజా ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సి ఉండటంతో అన్ని ఆలోచించి స్పెషల్ ఆఫీసర్లకు మొగ్గు చూపినట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు.
మూడు...ప్రతిపాదనలు...
ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో పంచాయతీల్లో సర్పంచ్ ల పదవీకాలం ముగిసాక తీసుకోవాల్సిన నిర్ణయం విషయమై అధికారులు మూడు రకాల ప్రతిపాదనలు సిఎం ముందు ఉంచినట్లు తెలిసింది. 1) పదవీకాలం ముగిసే సర్పంచులనే పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగించడం 2) ప్రత్యేకాధికారులను నియామకం 3)సర్పంచ్లు, వార్డు సభ్యులతో కలిసి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడం.ఈ మూడు ప్రతిపాదనల్లో సిఎం చంద్రబాబు ప్రత్యేకాధికారుల పాలనకే మొగ్గు చూపారు. అంతేకాదు పదవీకాలం ముగిసిన సర్పంచ్ ల స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించాలంటూ కలెక్టర్లను ఆదేశించారు. అంతేకాకుండా ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా ముగిసేలా చూడాలని ఎపి ప్రభుత్వం భావిస్తోంది.
బిజెపి...హెచ్చరిక...
మరోవైపు పంచాయతీల్లో అధికారుల పాలన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తామని బీజేపీ నేత సోము వీర్రాజు హెచ్చరించడం గమనార్హం. అభివృద్ధిని నిరోధించే ప్రయత్నమే స్పెషలాఫీసర్ల పాలన అంటూ బిజెపి ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు విమర్శించారు. ఇప్పుడు ఎపి ప్రభుత్వం ఈ విషయమై జీవోను సైతం విడుదల చేసిన నేపథ్యంలో బిజెపి ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.