సచివాలయ పరీక్షల లీకేజీపై ఏపీపీఎస్సీ తేల్చేసింది: సెల్ఫ్ గోలా..ఆత్మరక్షణలో పడ్డారా..!
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సచివాలయ పరీక్షల విషయంలో నెలకొన్న రగడ పైన ఏపీపీఎస్సీ తేల్చి చెప్పింది. కొద్ది రోజులుగా సచివాలయ పేపర్ లీక్ అయిందంటూ వార్తలు రావటం .. దీని పైన టీడీపీ..జనసేన సీరియస్ గా రియాక్ట్ అయ్యాయి. పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రులు రాజీనామా చేస్తారా..ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా అని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసారు. ఏపీపీఎస్సీ కేంద్రంగా పేపర్ లీక్ అయిందని..అక్కడ పని చేసే సిబ్బంది బంధవులకు ర్యాంకులు వచ్చాయంటూ ఆరోపణలు వెల్లు వెత్తాయి.
దీని పైన అధికార పార్టీ నేతలు.. మంత్రులు ఖండించారు. కానీ..స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. ఇక, ఇదే సమయంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ భాస్కర్ అసలు విషయం బయట పెట్టారు. ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ కేంద్రంగా వస్తున్న విమర్శలకు.. ఆరోపణలకు ముగింపు పలికారు. అయితే..ఇదే సమయంలో ఛైర్మన్ వివరణకు ముందుగా టీడీపీ ఈ వ్యవహారం పైనే కమిటీ వేసింది. దశల వారీ ఆందోళనలకు నిర్ణయించింది. ఇప్పుడు ఉదయ్ భాస్కర్ వివరణ తో రాజకీయంగా దుమారానికి కారణమైన ఈ వ్యవహారం ఎటు టర్న్ అవుతుందనేది ఆసక్తి కరంగా మారింది.
నాడు బాబు బినామీ నేడు సచ్చీలుడా... టీటీడీలో స్థానమా... జగన్ పై జనసేన ఫైర్
మాకు సంబంధం లేదు..
సచివాలయ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం పైన ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ స్పందించారు. కమిషన్ సభ్యులతో ఇదే అంశం మీద ఆయన సమీక్ష చేసారు. ఆ తరువాత సచివాలయ ఉద్యోగుల పరీక్షలకు ఏపీపీఎస్సీకి సంబంధం లేదని ఆ సంస్థ చైర్మన్ ఉదయభాస్కర్ తెలిపారు. పరీక్షలను పంచాయతీరాజ్శాఖ నిర్వహించిందని చెప్పారు. తాము నిర్వహించని పరీక్షలపై సమాధానం చెప్పలేమన్నారు. తమ సంస్థ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని అనేక అంశాలు కాన్ఫిడెన్షియల్గా ఉంటాయని పేర్కొన్నారు. పరీక్షలపై ప్రభుత్వం తమ సంస్థ నివేదిక కోరలేదని తెలిపారు. పరీక్షల పేపర్ లీకయిందో లేదో తనకు తెలియదని, పంచాయతీరాజ్ శాఖనే అడగండంటూ ఉదయ్ భాస్కర్ స్పష్టం చేసారు. ప్రశ్నాపత్రాల తయారీతో పాటుగా ప్రింటింగ్ బాధ్యతలను సైతం పంచాయితీ రాజ్ శాఖనే నిర్వహించిందని ఛైర్మన్ తేల్చి చెప్పారు. దీంతో..ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ లోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది బంధువులకు ర్యాంకులు వచ్చాయని..ప్రశ్నాపత్రం లీక్ అయిందనే వార్తలపైన ఉదయ్ భాస్కర్ ఇచ్చిన వివరణతో ఈ వ్యవహారం ముగుస్తుందా..లేక రాజకీయంగా కొత్త టర్న్ తీసుకుంటుందా అనే చర్చ మొదలైంది.
పోరాటానికి సిద్దమైన టీడీపీ..
ఏపీపీఎస్సీ ఛైర్మన్ వివరణకు ముందే టీడీపీ ఇదే విషయం పైన కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నేతలతో పాటుగా తెలుగు విద్యార్ధి నాయకులతో కలిసి కమిటీ ఏర్పాటు చేసింది. దీని పైన రౌండ్ టేబుట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో ఛలో కలెక్టరేట్లు పిలుపునివ్వాలని డిసైడ్ అయింది. ఇదే వ్యవహారం పైన రెండు రోజుల క్రితం ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసారు. పరీక్ష పత్రం లీక్ కు బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి రాజీనామా చేస్తారా..ముఖ్యమంత్రిగా మీరు చేస్తారా అని ప్రశ్నిస్తూ గతంలో తన హయాంలో ప్రశ్నా పత్రాలు లీక్ కాకపోయినా.. అయినాయని విమర్శలు చేసి రాజీనామాకు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసారు. చంద్రబాబు లేఖ పైన అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు స్పందించారు. వారితో పాటుగా వైసీపీ నేతలు టీడీపీ పైన..ఈ ప్రచారం చేసిన వారి పైన ఫైర్ అయ్యారు. ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని..ఒకే విడతలో ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇతర పార్టీలు ఇప్పుడు ఏం చేస్తాయి..
టీడీపీతో పాటుగా బీజేపీ..జనసేన..వామపక్ష నేతలు సైతం దీని పైన ప్రభుత్వాన్ని నిలదీసాయి. ప్రశ్నాపత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు విమర్శించారు. ఫలితాలు ఆపివేయాలని డిమాండ్ చేసారు. ఇక..బీజేపీ నేతలు సైతం దీని పైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ తీసుకొచ్చారు. ఇటువంటి డిమాండ్లు.. ఆరోపణల నడుమ ఏపీపీఎస్సీ ఛైర్మన్ స్వయంగా వివరణ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఏపీపీఎస్సీ వివరణ ద్వారా రాజకీయంగా పై చేయి సాధించారు. తమ ప్రభుత్వం మీద ఉద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేసిన పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయని..వారందరూ సెల్ఫ్ గోల్ చేసుకున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఇవే పార్టీలు ఏ రకంగా స్పందిస్తాయో చూడాలి.