నిమ్మగడ్డ తరహాలో ఏపీలో మరో వివాదం- సర్కార్ సహాయ నిరాకరణపై గవర్నర్ కు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఫిర్యాదు..
ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ పదవుల్లో నియమించిన పలువురు అధికారులను వైసీపీ సర్కారు వేధిస్తుందన్న ఆరోపణలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం జగన్ కు కొరకరాని కొయ్యలుగా మారిన కొందరు రాజ్యాంగ పదవుల్లో ఉన్న అధికారుల వ్యవహారంపై చర్చ సాగుతుండగానే అందులో ఒకరు తాజాగా గవర్నర్ ను ఆశ్రయించారు. అంతకు ముందే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కేంద్ర హోంశాఖను ఆశ్రయించిన నేపథ్యంలో తాజా వివాదం ప్రాధాన్యం సంతరించుకుంది.
నిమ్మగడ్డ తరహాలోనే ఉదయ్ భాస్కర్..
ఏపీలో రాజ్యాంగ పదవిలో తన విచక్షణాధికారంతో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అధికారులను వైసీపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోలేదన్న కారణంతో వేధిస్తున్న ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషనర్ గా తన విచక్షణను ఉపయోగించి కరోనా ప్రభావంతో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన నిమ్మగడ్డ వ్యవహారం చల్లారకముందే ఇదే తరహాలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ కూడా దాదాపు ఇదే తరహా కారణంతో గవర్నర్ ను ఆశ్రయించారు. గతేడాది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయ్ భాస్కర్ ను తప్పించేందుకు వైసీపీ సర్కారు విఫలయత్నం చేసింది. ఇప్పుడు ఆయన గవర్నర్ కు చేసిన తాజా ఫిర్యాదుతో వేధింపులు కూడా వెలుగు చూశాయి
ఉదయ్ భాస్కర్ కు సహాయ నిరాకరణ..
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన పిన్నమనేని ఉదయ్ భాస్కర్ కు నిజాయితీపరుడైన, సమర్ధుడైన అధికారిగా పేరుంది. అప్పట్లో ఆయన నియామకంపై ఎవరూ మాట్లాడలేదు. కానీ గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉదయ్ భాస్కర్ కు సెగ మొదలైంది. విజయవాడ బందరు రోడ్డులో ఉన్న ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఛైర్మన్ కు ఓ పేషీ కానీ, సిబ్బందిని కానీ కేటాయించలేదు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ వంటి రాజ్యాంగ పదవిలో ఉన్న ఉదయ్ భాస్కర్ కు కనీసం అటెండర్ ను కూడా ఇవ్వలేదు.
ఛైర్మన్ బాధ్యతలూ సెక్రటరీకే..
ఉదయ్ భాస్కర్ గవర్నర్ కు చేసిన ఫిర్యాదులో పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఛైర్మన్ గా తాను చేయాల్సిన పనులనూ సెక్రటరీతో చేయించుకుంటున్నారని, కమిషన్ లో సభ్యులు సైతం గుడ్డిగా సంతకాలు చేస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఉదయ్ భాస్కర్ ఆరోపించారు. ఓ దశలో కమిషన్ మెంబర్ గా ఉన్న రంగరాజన్ ను ఇన్ ఛార్జ్ ఛైర్మన్ గా కూడా నియమించారని, ఈ అధికారం గవర్నర్ కు మాత్రమే ఉందన్నారు. కానీ గవర్నర్ అధికారాలను సైతం సెక్రటరీ పీఎస్ఆర్ ఆంజనేయులు లాగేసుకున్నారని ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. గత నాలుగు నెలల కాలంలో పలు రిక్రూట్ మెంట్లు జరిగినా ఒక్క ఫైలు కూడా తనవద్దకు రాలేదన్నారు. సభ్యులు, కార్యదర్శి అంతా తనతో మాట్లాడటం మానేశారన్నారు.
ఎన్ని అవమానాలు జరుగుతున్నా...
టీడీపీ ప్రభుత్వ హయాంలో తన నియామకం జరిగిందన్న కారణంలో గత నాలుగు నెలలుగా తనకు చుక్కలు చూపిస్తున్నారని, తన కార్యాలయంలోనే అన్ని విధాలుగా సహాయనిరాకరణ జరుగుతోందని ఉదయ్ భాస్కర్ గవర్నర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్ని అవమానాలు జరుగుతున్నా తాను మాత్రం రోజూ ఆఫీసుకు వచ్చి వెళుతున్నట్లు ఉదయ్ భాస్కర్ తెలిపారు. నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీలో రోజువారీ కార్యకలాపాలు జరిగేలా చూడాలని ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ గవర్నర్ హరిచందన్ ను కోరారు.