గ్రూప్ 1,2 ఎగ్జామ్స్ పై ఎపిపిఎస్సీ కసరత్తు:ఇకపై ఉద్యోగ విధులకు తగినట్లుగా సిలబస్
Recommended Video
అమరావతి:ఉద్యోగ అర్హతా పరీక్షలకు సంబంధించి సిలబస్ ను ఉద్యోగ విధులకు తగినట్లుగా రూపొందించడంపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సీ) దృష్టిపెట్టింది. ముఖ్యంగా గ్రూపు-1 ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్) కింద రెండు రాత పరీక్షలను నిర్వహించాలని ఎపిపిఎస్సీ నిర్ణయించింది.
మెయిన్స్ పరీక్షను ఆంగ్లంతో పాటు తెలుగు పరీక్షలోనూ అర్హత సాధిస్తేనే మిగిలిన జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు అభ్యర్థుల సౌకర్యార్థం గ్రూపు-1 ప్రధాన పరీక్షల సిలబస్లో ఎటువంటి మార్పులు చేయకుండానే ఒకే అంశానికి సంబంధించిన ప్రశ్నలను ఒకచోట మాత్రమే ఇవ్వాలని ఎపీపీఎస్సీ భావిస్తోంది. వివరాల్లోకి వెళితే...
ఉమ్మడి పరీక్ష...ఎపిపిఎస్సీ భావన
ఒకే ఉద్యోగానికి రకరకాల అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారందరికీ వేర్వేరుగా కాకుండా ఒకే సిలబస్తో ఉమ్మడి పరీక్షను నిర్వహించాలని ఎపిపిఎస్సీ భావిస్తోంది. ఉదాహరణకు అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు. వీరికి వేర్వేరుగా కాకుండా ఉద్యోగానికి తగినట్లు ఒకే ఉమ్మడి పరీక్షను జరపాలని నిర్ణయించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇతర ఉద్యోగాల విషయంలోనూ ఇదేవిధానాన్ని అనుసరించనున్నట్లు సమాచారం.
అలాగే...గ్రూప్-1 ప్రిలిమినరీలో...
ఇప్పటివరకూ గ్రూపు-1కు ప్రిలిమినరీ పరీక్ష కింద ఒక పేపరు ద్వారా 150 మార్కులకు నిర్వహిస్తున్నారు. ఇకపై 120 మార్కులకు జనరల్ స్టడీస్, 120 మార్కులకు జనరల్ ఆప్టిట్యూడ్లో పరీక్షను నిర్వహించనున్నారు. రెండు గంటల వ్యవధిలో ఈ పరీక్షలు విడివిడిగా జరుగుతాయి. అలాగే కొత్తగా నిర్వహించబోయే జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, సైకలాజికల్ ఎబిలిటీ, అంతర్జాతీయ సంబంధాలు, సామాజిక న్యాయం, రాజనీతిశాస్త్రం, జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ప్రణాళిక అమలు, జాగ్రఫి ప్రశ్నలు ఉండబోతున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కూడా ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ప్రాథమిక పరీక్ష ద్వారా ప్రధాన పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తుండగా ఇకపై 1:12 నుంచి 1:15 నిష్పత్తిలో సామాజిక వర్గాల వారీగా సమతుల్యతను అనుసరిస్తూ ఎంపికచేస్తారు.
గ్రూప్-1 మెయిన్స్ లో...పరీక్షలు ఇలా...
ప్రస్తుతం గ్రూప్-1 మెయిన్స్ లో ఐదు పరీక్షలను వ్యాస రూపంలో నిర్వహిస్తున్నారు. ఆంగ్లంలో 150 మార్కులకు మూడు గంటల వ్యవధిలో పరీక్ష ఉంటోంది. ఇకపై తెలుగులోనూ, ఆంగ్లంలోనూ మూడేసి గంటల వ్యవధిలో 120 మార్కుల చొప్పున పరీక్ష ఉంటుంది. ఈ రెండు పరీక్షల్లో అభ్యర్థులు అర్హత సాధించడం తప్పనిసరి. తెలుగు పరీక్షలో... తెలుగును ఆంగ్లంలోకి అనువదించడం, వర్తమాన అంశాలపై రాయడం, ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ గురించి రాయడం తదితర అంశాలపై ప్రశ్నలు ఇవ్వనున్నారు.
అందరికీ...సమన్యాయం కోసమే
గ్రూపు-1 ప్రధాన పరీక్షల్లో గణితం నేపథ్యం ఉన్న వారు మిగిలిన వారి కంటే డేటా అనాలసిస్లో ముందంజలో ఉంటున్నారన్న ఓ అభిప్రాయం అభ్యర్థుల్లో ఉంది. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన ప్రశ్నలను కనీస స్థాయిలో ప్రిలిమ్స్లో ఇచ్చే విధంగా ప్రతిపాదించారు. అలాగే పొలిటికల్ సైన్స్, రాజ్యాంగం, పరిపాలన, న్యాయరంగం, విలువలు వంటి రంగాలకు చెందిన అంశాలు సిలబస్లోనే వేర్వేరుచోట్ల ఉన్నాయి. వీటిని ఒకే పేపరు కింద నిర్వహించాలని ముసాయిదాలో పేర్కొన్నారు.
గ్రూప్ 2 కు సంబంధించి...ఇలా
అలాగే గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించి...హిస్టరీ, జాగ్రఫీ విషయంలోనూ ఇటువంటి ప్రతిపాదనలే ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద జనరల్ సైన్స్, ఎనర్జీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సాలిడ్ వేస్ట్మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ, మానవ రోగాల వంటి అంశాలన్నీ ఒకేచోట ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే మరో ముఖ్యమైన సర్వీసు గ్రూపు-2 కు సంబంధించి ఇప్పటివరకు ప్రాథమిక పరీక్షకు ఒక సిలబస్, ప్రధాన పరీక్షకు మరో సిలబస్ అమల్లో ఉంది. ఇకపై ఈ రెండు పరీక్షలకు ఒకే సిలబస్ విధానాన్ని తీసుకువచ్చేందుకు ఎపీపీఎస్సీలో సమాలోచనలు సాగుతున్నాయని సమాచారం.