APPSC Group-1: కౌంటర్ దాఖలుకు ఇంకెంత సమయం కావాలి: ఏపీపీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం
అమరావతి: ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహణపై ఈ రోజు ఏపీ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే 2018 ఏపీపీఎస్సీ గ్రూప్ -1నోటిఫికేషన్కు సంబంధించి మెయిన్స్ పరీక్ష నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 2వ తేదీ నుంచి పరీక్షలు జరిపేందుకు షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలోనే అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షలో తప్పులు దొర్లాయంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ఏడాది మొదట్లోనే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే కేసు విచారణకు వచ్చిన సందర్భంలో కౌంటర్ దాఖలు చేసేందుకు ఏపీపీఎస్సీ తరపున న్యాయవాది సమయం కోరుతూ వచ్చారు. ఇక మెయిన్స్ పరీక్షకు తేదీలు విడుదల కావడం, అభ్యర్థుల్లో ఆందోళన పెరగుతుండటంతో న్యాయస్థానం ఏపీపీఎస్సీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ వేసేందుకు ఇంకెంత సమయం తీసుకుంటారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో కొన్ని తప్పులు దొర్లాయని దీంతో తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందంటూ అభ్యర్థుల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రిలిమ్స్ పరీక్ష తర్వాత విడుదలైన " ప్రాథమిక కీ "లో తప్పులున్నాయంటూ అభ్యర్థులు ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ప్రాథమిక కీ పై ఏపీపీఎస్సీ నిపుణుల కమిటీ వేసింది. ప్రాథమిక కీ ని పరిశీలించిన నిపుణుల కమిటీ రివిజినల్ కీ ని విడుదల చేసింది. అందులో కూడా తప్పులు ఉన్నాయంటూ అభ్యర్థులు పేర్కొన్నారు. ఇక చివరిగా ఫైనల్ కీ ని అదే నిపుణుల కమిటీ విడుదల చేయగా వీటిలో కూడా తప్పులు దొర్లాయని పేర్కొన్న అభ్యర్థులు తమకు న్యాయం జరగాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
కేసును విచారణ చేసిన న్యాయస్థానం ఏపీపీఎస్సీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారంలోగ కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. తిరిగి కేసును మంగళవారం విచారణ చేస్తామంటూ వాయిదా వేసింది. ఇక ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్ష ఆదినుంచి వివాదాస్పదంగానే ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. కోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే ఎలాంటి ఆదేశాలు రాకముందే మెయిన్స్ పరీక్షకు షెడ్యూల్ ఎలా విడుదల చేస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.