APPSC గ్రూప్-1: నవంబర్ 2న జరగాల్సిన మెయిన్స్ పరీక్ష వాయిదా.. ఏపీపీఎస్సీకి హైకోర్టు కీలక ఆదేశాలు
2018 గ్రూప్ -1 నోటిఫికేషన్కు సంబంధించి ఏపీపీఎస్సీకి షాక్ తగిలింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పేపర్లో తప్పులున్నాయన్న వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. దీంతో గ్రూప్-కు సంబంధించి నవంబర్ 2న జరగాల్సిన మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాల్సిందిగా హైకోర్టు ఏపీపీఎస్సీకి సూచించినట్లు సమాచారం. ప్రిలిమ్స్ పేపర్లో తప్పులున్నాయన్న వాదనతో ఏకీభవించిన హైకోర్టు...వాటిని తొలగించి అభ్యర్థుల తాజా జాబితాను విడుదల చేయాలని కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఇక ఏపీపీఎస్సీలో తప్పులున్నాయని తొలగించకుండానే మెయిన్స్ పరీక్షను నిర్వహించడం వల్ల తమకు నష్టం జరుగుతోందని పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అడ్వకేట్ బొద్దులూరి శ్రీనివాస్, భరత్ చంద్రలు ఈ విషయమై రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వీరి తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో తప్పులు దొర్లడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతకుముందు కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీపీఎస్సీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం కూడా వాదనలు జరిగాయి. ఇక గురువారం రోజున వాదనలు ముగిశాయి. కోర్టు అభ్యర్థుల తరపున వాదించిన న్యాయవాది వాదనతో ఏకీభవించింది.
Recommended Video
ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో కొన్ని తప్పులు దొర్లాయని దీంతో తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందంటూ అభ్యర్థుల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రిలిమ్స్ పరీక్ష తర్వాత విడుదలైన " ప్రాథమిక కీ "లో తప్పులున్నాయంటూ అభ్యర్థులు ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ప్రాథమిక కీ పై ఏపీపీఎస్సీ నిపుణుల కమిటీ వేసింది. ప్రాథమిక కీ ని పరిశీలించిన నిపుణుల కమిటీ రివిజినల్ కీ ని విడుదల చేసింది. అందులో కూడా తప్పులు ఉన్నాయంటూ అభ్యర్థులు పేర్కొన్నారు. ఇక చివరిగా ఫైనల్ కీ ని అదే నిపుణుల కమిటీ విడుదల చేయగా వీటిలో కూడా తప్పులు దొర్లాయని పేర్కొన్న అభ్యర్థులు తమకు న్యాయం జరగాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గత కొంతకాలంగా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే నవంబర్ 2న మెయిన్స్ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వాదనలను త్వరగా ముగించేందుకు చొరవ చూపడంతో కోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది.