6 నెలల పాటు ఉచిత వసతి: రాజధాని ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వ ఆఫర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పాలన అంతా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచే చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగులంతా అమరావతికి తరలిరావాల్సిందేనని గత నెలలో ఏపీ ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే.
కనీస మౌలిక వసతులు లేకుండా ఎలా వస్తామన్న ఉద్యోగులపై సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉద్యోగులకు హెచ్ఆర్సీ, ఐదు రోజుల పని దినాలు లాంటి హామీలను ఇవ్వడంతో ఉద్యోగులు అమరావతికి వచ్చేందుకు సిద్ధమయ్యారు.
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పనులను సైతం స్వయంగా పరిశీలించారు. దీంతో కొంత మేరకు సంతృప్తి చెందిన ఉద్యోగులు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో రాజధాని అమరావతికి బయల్దేరారు.
అమరావతి ప్రాంతం నుంచే పాలన సాగించేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఉన్నపళంగా అద్దె ఇళ్లను తీసుకోలేని, తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిగా ఉండే ఉద్యోగులకు ప్రభుత్వమే వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మహిళా ఉద్యోగులకు 6 నెలల పాటు ఉచితంగా వసతిని ప్రభుత్వమే కల్పించనుంది.
ఇక పురుష ఉద్యోగులకు అద్దెను షేర్ చేసుకునే పద్ధతిలో వసతి కల్పించనున్నట్లు ప్రకటించింది. ఏపీ ప్రభుత్వమే ఏర్పాటు చేయనున్న వసతి తమకు కావాలంటూ ఇప్పటికే 326 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
కాగా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఇప్పటికే పలు శాఖలు తరలి వెళ్లిన నేపథ్యంలో మేమొస్తామంటూ ముందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తామంటూ ఏపీపీఎస్సీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ కూడా రాసింది.
అయితే ఈ లేఖపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విశేషం. రాజధానిలో ఏపీపీఎస్సీని ఏర్పాటు చేస్తే కార్యాలయానికి నిరుద్యోగులు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నందున ప్రత్యేక భవంతి చూపించాలన్న ఏపీపీఎస్సీ అభ్యర్థనను పక్కకుపెట్టినట్లుగా తెలుస్తోంది.
రెండో విడతలో తరలింపులో భాగంగా ఏపీపీఎస్సీకి భవంతిని చూపిస్తామని, అప్పటిదాకా కాస్తంత ఓపిక పట్టాలని చెప్పారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విమర్శలు తలెత్తుతున్నాయి. రాజధానికి ఇష్టంలేని ఉద్యోగులను బలవంతాను తరలించిన ప్రభుత్వం తమకు తాముగా వస్తామంటున్న ఉద్యోగుల తరలింపుపై దృష్టి సారించడం లేదని అంటున్నారు.