ఏపీపీఎస్సీపై జగన్ సంచలన నిర్ణయం: ప్రశ్నాపత్రాల రూపకల్పనలో ఐఐటీ, ఐఐఎం సహకారం
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రతిష్ఠాత్మక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో ప్రక్షాళన చేపట్టారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి, అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారాయన. ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల రూపకల్పనలో జాతీయ స్థాయి విద్యాసంస్థల సహాయ, సహకారాలు, విలువైన సూచనలను తీసుకోనున్నారు.
పారదర్శకత, జవాబుదారీతనం కోసం..
రాష్ట్రంలో ఇక ప్రతి సంవత్సరమూ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అవసరమైన చర్యలను తీసుకుంటామని వైఎస్ జగన్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏటా జనవరిలో ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్ దే. వివిధ శాఖలు, విభాగాల్లో, దాదాపు అన్ని స్థాయిల్లో ఉండే ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన పరీక్షల నిర్వహణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పర్యవేక్షిస్తుంది. ఈ నేపథ్యంలో- ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించే పరీక్షల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రశ్నాపత్రాల రూపకల్పనలో ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ
పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను రూపొందించడానికి జాతీయ స్థాయి విద్యాసంస్థల సహకారాన్ని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థలకు చెందిన నిపుణుల సహకారంతో ప్రశ్నాపత్రాలను రూపొందించనుంది. దీనిపై- పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీపీఎస్సీ కార్యదర్శి దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
పరీక్షల విధానంలో మార్పుల కోసం
పరీక్షల నిర్వహణ విధానం, ప్రశ్నాపత్రాల రూపకల్పనలో మార్పులను తీసుకుని రావాల్సిన అవసరం ఉందని అంటూ ఏపీపీఎస్సీ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ అధ్యక్షతన కిందటి నెల 18వ తేదీన ఓ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ప్రశ్నాపత్రాల రూపకల్పనలో పారదర్శకతను పెంపొందించంలో భాగంగా.. వాటి రూపకల్పనలో జాతీయ స్థాయి విద్యా సంస్థల సహకారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
గ్రామ సచివాలయం మొదలుకుని..
గ్రామ సచివాలయ ఉద్యోగుల ఖాళీలు మొదలుకుని, ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే దాదాపు అన్ని పరీక్షల ప్రశ్నాపత్రాల రూపకల్పనలో ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ వంటి విద్యాసంస్థల సహకారాన్ని తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వంలోని అన్ని శాఖలు, విభాగాల్లో వందలాది సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగి స్థానాన్ని క్యాజువల్, కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించిన ఉద్యోగులతో భర్తీ చేస్తూ వచ్చారు. ఇకపై ఈ విధానాన్ని పక్కన పెట్టి, శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలను కల్పిస్తామని వైఎస్ జగన్ ఇదివరకే వెల్లడించారు. దీనికోసం ఏటా జనవరిలో ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేస్తామని ప్రకటించారు.