నిరుద్యోగులకు మరింత సులువుగా..: ప్రక్షాళన దిశగా ఏపీపీఎస్సీ: ఇంటర్వ్యూల కోసం మూడు బోర్డులు ..!
ఏపీపీఎస్సీ పై ఇక వివాదాలకు ఛాన్స్ ఇవ్వద్దు. నిరుద్యోగులకు మరింత వెసులుబాటు కలిగించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేయాలని నిర్ణయం జరిగింది. ఇక, ఇప్పుడు ఏపీపీఎస్సీ ప్రక్షాళన దిశగా దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో అభిప్రాయాల సేకరణకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవడానికి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు.
కమిషన్ నిర్ణయాలపై గతంలో నిరుద్యోగులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. పలు అడ్డగోలు నిబంధనలు, పరీక్షల నిర్వహణలో, ప్రశ్నపత్రాల తయారీలో తప్పిదాలు నిరుద్యోగులకు నష్టం కలిగించాయింటూ విమర్శలు ఉన్నాయి. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం కొత్త కార్యాచరణ మొదలు పెట్టింది.
ఎగ్జిక్యూటివ్ పోస్టులు మినహా
ఏపీపీఎస్సీ వ్యవహారా పైన ముఖ్యమంత్రి జగన్ తాజాగా సమీక్షించారు. నియామకాలన్నీ పారదర్శకంగా నిర్వహించేలా పలు సూచనలు చేశారు. గ్రూప్1 పోస్టులు, మరికొన్ని ప్రత్యేక కేటగిరీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మినహాయించి తక్కిన అన్ని కేటగిరీల పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దుచేశారు. క్యాలెండర్ ప్రకారం నియామకాలకు ఏటా జనవరిలో కమిషన్ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీలో నిరుద్యోగులకు ఇబ్బందికరంగా ఉన్న పలు అంశాలను సరిచేసేలా ఇటీవల కమిషన్ కార్యదర్శి పి.సీతారామాంజనేయులు ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు అందించారు.
ఇంటర్వ్యూలకు మూడు బోర్డులు..
ఇప్పటి వరకు ఏపీపీఎస్సీలో జరిగే ఇంటర్వ్యూలను ఛైర్మన్ ఆధ్వర్యంలో ఒకే ఒక్క బోర్డు నిర్వహించేది. ఇక, ఇప్పుడు దానిని మూడు బోర్డులుగా మార్పు చేసారు. గ్రూప్1 మినహా ఇతర పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్ష లేదు. కానీ ప్రిలిమ్స్ను కమిషన్ అన్నిటికీ అమలు చేస్తోంది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో ఎంపిక విధానాన్ని రద్దుచేసి 1:15కు కుదించడంతో నిరుద్యోగులు నష్టపోయారు. కొత్త ప్రభుత్వం దీన్ని మార్పు చేసి 1:50కి మార్పు చేసింది. పలు పరీక్షల్లో ప్రశ్నలు వాటి సమాధానాల ఆప్షన్లు తప్పుల తడకగా ఇచ్చారు.
ఆంగ్లం నుంచి తెలుగు అనువాదం తప్పులు అభ్యర్థులను తికమకకు గురిచేశాయి. గతంలో ఏకంగా 42 ప్రశ్నల్లో తప్పులు రావడంతో ఏపీపీఎస్సీ వాటిని తొలగించాల్సి వచ్చింది. ఇక, ఇలాంటి వాటికి అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు కొత్త నిర్ణయాలు అమలు చేస్తామని ఏపీపీఎస్సీ అధికారులు చెబుతున్నారు.
సూచనలు..సలహాలు కోరుతూ..
సీఎం జగన్ సూచనలతో ఏపీపీఎస్సీ నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తామని కమీషన్ కార్యదర్శి సీతారామాంజనేయుటు చెబుతున్నారు. ఏకపక్ష నిర్ణయాలకు తావుండదన్నారు. కమిషన్ లో గతంలోని తప్పిదాల వల్ల నిరుద్యోగులు చాలా నష్టపోయారని వివరించారు. వీటికి బాధ్యులైన వారు తప్పించుకునే పద్ధతి సరికాదనేది కొత్త ప్రభుత్వ అభిప్రాయంగా చెబుతున్నారు. దీనికి కమిషన్లోని వారిదే బాధ్యత అవుతుందని స్పష్టం చేస్తున్నారు. అందుకే కమిషన్ లో ఎలాంటి లోపాలున్నాయో విద్యార్థులు.. నిరుద్యోగులు..మేధావులు.. ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణ కోసం సదస్సు నిర్వహిస్తున్నారు. అందరి నుంచి సూచనలు తీసుకొని తప్పులు సరిదిద్దుతామని ఏపీపీఎస్సీ కార్యదర్శి స్పష్టం చేస్తున్నారు.