జగన్ సర్కార్ను నిమ్మగడ్డ ఇప్పట్లో వదలట్లేదా?: మూడు నెలల పొడిగింపు కోసం పక్కా ప్లాన్
అమరావతి: రాష్ట్రంలో ఏడాదికాలంగా జగన్ సర్కార్-ఎన్నికల కార్యాలయం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూ వస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో తలెత్తిన వివాదం.. ఇప్పటికీ సమసి పోవట్లేదు పైగా మరింత తీవ్ర రూపాన్ని దాల్చుతోంది. గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తుతం.. దానికి పూర్తి భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఈ సారి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికల నిర్వహణ కోసం షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ రెండు సందర్భాల్లోనూ ప్రభుత్వాన్ని ఆయన ముందస్తు సమాచారం ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి.
మూడు నెలల పాటు పదవీ కాలం పొడిగింపు కోసం..
ఈ పరిణామాల మధ్య నిమ్మగడ్డ రమేష్ కుమార్.. స్థానిక సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించి తీరాలనే అభిప్రాయంతో ఉన్నారనేది స్పష్టమౌతోంది. ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా.. ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇంకొకలా వ్యవహరిస్తున్నారంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి విమర్శలను ఎదుర్కొంటోన్న ఆయన మరో మూడు నెలల పాటు తన పదవీకాలాన్ని పొడిగించుకోవడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
మార్చిలో ముగియనున్న పదవీకాలం
నిమ్మగడ్డ రమేష్కుమార్ పదవీ కాలం మార్చి 31వ తేదీన ముగుస్తుంది. 2016లో అప్పటి చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితులు అయ్యారు. అయిదేళ్ల పదవీ కాలం మార్చితో ముగుస్తుంది. ఆ తరువాత కూడా మరో మూడు నెలల పాటు తన పదవీ కాలాన్ని పొడిగించుకోవాలనే ఆలోచనలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నట్లు చెబుతున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత.. తనను అర్ధాంతరంగా తొలగించిన కాలాన్ని పరిహారంగా దక్కించుకోవడానికి ఆయన అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారని తెలుస్తోంది.
తొలగించడాన్ని సవాల్ చేస్తూ..
తనను పదవి నుంచి తప్పించడంపై నిమ్మగడ్డ రమేష్కుమార్ ఇదివరకు హైకోర్టును ఆశ్రయించడం, ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడటం చోటు చేసుకున్నవిషయం తెలిసిందే. సుమారుగా మూడు నెలలకుపైగా ఆయన పదవికి దూరం అయ్యారు. అప్పట్లో ఆయన స్థానంలో జగన్ సర్కార్.. మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించింది. చట్టవిరుద్ధంగా జగన్ ప్రభుత్వం తనను పదవి నుంచి తొలగించిందనే విషయాన్ని న్యాయస్థానాలు బలపరిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాను కోల్పోయిన పదవీ కాలాన్ని తిరిగి పొడిగింపు రూపంలో దక్కించుకోవాలని రమేష్ కుమార్ భావిస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల నిర్వహించి తీరాలనే పట్టుదలతో..
తన పదవీకాలంలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహించి తీరాలనే పట్టుదలతో రమేష్ కుమార్ ఉన్నారని చెబుతున్నారు. తాను పదవీ విరమణ చేసే నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేకపోతే మాత్రం.. తప్పనిసరిగా పదవీ కాలాన్ని పొడిగించుకోవడానికి హైకోర్టును ఆశ్రయించడం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తనను తొలగించినప్పటి నుంచి మళ్లీ పునర్నియామకం వరకు కోల్పోయిన పదవీ కాలాన్ని పొడిగింపు రూపంలో దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారని తెలుస్తోంది.