నిమ్మగడ్డ ఆన్ ఫైర్: అమ్మఒడి అమలు ఎఫెక్ట్?: ఎన్నికల సంఘంలో ఫస్ట్ వికెట్: జేడీపై యాక్షన్
అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న అమ్మఒడి పథకం అమలవుతోన్న వేళ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో ఈ పథకం రెండో విడత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సమయంలో.. ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల కమిషనర్ జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్ హఠాత్తుగా దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 30 రోజుల పాటు ఆయన సెలవుపై వెళ్లినట్లు చెబుతున్నారు.
జీవీ సాయి ప్రసాద్ వ్యవహార శైలి పట్ల ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్ర అసంతృప్తితో, అసహనంతో ఉన్నారని అంటున్నారు. అందుకే ఆయనపై క్రమశిక్షణాచర్యలను తీసుకున్నారని సమాచారం. ఇందులో భాగంగా నెలరోజుల పాటు సెలవులోకి వెళ్లాలని సాయి ప్రసాద్ను ఆదేశించినట్లు తెలుస్తోంది. సాయి ప్రసాద్.. తన తోటి ఉద్యోగులను ప్రభావితం చేసేలా కొన్ని నిర్ణయాలను తీసుకుంటున్నారని అనుమానిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్కు వ్యతిరేకంగా వారిని ప్రభావితం చేసినట్లు భావిస్తున్నారు. దీన్ని క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించి, సెలవుల్లో వెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
రెండో విడత అమ్మఒడి పథకాన్ని వైఎస్ జగన్ ప్రారంభించిన కొద్ది సేపటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తన కార్యాలయ ఉన్నతాధికారిపై క్రమశిక్షణాచర్యలకు దిగడం చర్చనీయాంశమౌతోంది. రెండో విడత అమ్మఒడి పథకాన్ని ప్రారంభించడాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా భావిస్తోంది. వచ్చేనెలలో నాలుగు విడతల్లో నిర్వహించదలిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, అయినప్పటికీ.. దానికి విరుద్ధంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడాన్ని తప్పు పడుతోంది.
ఈ ఎన్నికల నోటిఫికేషన్కు అనుగుణంగా సాయి ప్రసాద్ విధులను నిర్వర్తించట్లేదని, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చూపుతున్నట్లు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేలా, తోటి ఉద్యోగులను ఆయన సొంతంగా సెలవుల్లోకి పంపించేలా చర్యలు తీసుకుంటున్నారని గుర్తించారని అంటున్నారు. సెలవు దినాల్లో ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యేక్షంగా గానీ, పరోక్షంగా గానీ విధులు నిర్వహించడానికి వీలులేదని రమేష్ కుమార్ స్పష్టం చేసినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.