తిరుమల శ్రీవారి సన్నిధిలో నిమ్మగడ్డ కుటుంబం -రేపే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్?
కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు, ప్రతిపక్షాల ఫిర్యాదులు మినహా ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలు సజావుగా సాగిపోతున్న దరిమిలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా తిరుమల వచ్చిన ఆయన.. శ్రీవారిని దర్శించుకున్నారు. రెండు వారాల కిందట కూడా తిరుమల వచ్చిన ఆయన.. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఆ విధంగానే ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుండటంతో ఆయన మొక్కులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇదే ఊపులో మున్సిపల్ ఎన్నికలకు కూడా ఎస్ఈసీ సిద్ధమైనట్లు సమాచారం..
2వ దశలోనూ వైసీపీ ప్రభంజనం -చంద్రబాబుకు మతిభ్రమణం -మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ -3పై నిమ్మగడ్డ నిఘా
నిమ్మగడ్డకు సత్కారం..
కుటుంబ సమేతంగా తిరుమల వచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో నిమ్మగడ్డ కుటుంబ సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఎస్ఈసీని పట్టువస్త్రంతో సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా,
మారిన ఎస్ఈసీ షెడ్యూల్..
మూడో విడత గ్రామ పంచాయితీ ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, చిత్తూరు జిల్లా పుంగనూరు సహా గుంటూరు జిల్లా మాచర్లలో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఫిర్యాదు చేయడం, హైకోర్టును కూడా ఆశ్రయించిన దరిమిలా ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక చర్యలకు ఉపక్రమించారు. ఆదివారం పుంగనూరు వెళ్లి ఏకగ్రీవాలను స్వయంగా పరిశీలించేందుకు ఆయన సిద్ధమయ్యారు. నిజానికి తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆయన విజయవాడకు తిరిగి వెళ్లాల్సి ఉన్నా, పుంగనూరులో పర్యటించేలా ఎస్ఈసీ షెడ్యూల్ మార్పునకు గురైంది. ఏకగ్రీవాల పరిశీలన నిమిత్తం సోమవారం వరకు ఆయన తిరుమలలోనే ఉంటారని తెలుస్తోంది. దీనిపై..
3వ దశపై గట్టి ఫోకస్..
పుంగనూరు, తంబల్లపల్లి, మాచర్లలో ఎన్నికల అక్రమాలు జరిగాయని ఆరోపించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. వాటిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ చర్యలు తీసుకోలేదని, అందుకే హైకోర్టులో పిటిషన్ వేశామని, అది ఈవారమే విచారణకు వస్తుందని తెలిపారు. ఈలోపే, మూడో దశ ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలపై గట్టి నిఘా పెడుతున్నామంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, తొలి రెండు దశల్లాగే మూడో విడతలోనూ ప్రజలు స్వేచ్చంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని నిమ్మగడ్డ కోరారు. చంద్రబాబు కోర్టును ఆశ్రయించడంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో గెలవడం చేతకాకే టీడీపీ ఇలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మరోవైపు..
మున్సిపోల్స్కు నోటిఫికేషన్?
స్థానిక ఎన్నికల విషయంలో తొలి నుంచీ ఎస్ఈసీ నిమ్మగడ్డతో విభేదిస్తూ వస్తోన్న జగన్ సర్కారు తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. పంచాయితీ ఎన్నికల తొలి రెండు దశల్లో వైసీపీ బలపర్చిన అభ్యుర్థులు భారీ సంఖ్యలో గెలుపొందడం, ఏకగ్రీవాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే జరగడం తెలిసిందే. ఈ క్రమంలోనే మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు కూడా ప్రభుత్వం సమ్మతించినట్లు సమాచారం. ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్న నిమ్మగడ్డ.. విజయవాడకు చేరుకున్న వెంటనే మున్సిపోల్స్ పై కీలక ప్రకటన చేస్తారన, సోమవారం లేదా వచ్చే వారంలో ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం అధికారికంగా నిర్ధారణ కాలేదు.
కవల పిల్లల్ని ఎత్తుకెళ్లిన కోతులు -ఇంటి పైకప్పు తొలగించి బీభత్సం -8రోజుల పసికందు మృతి