APSRTC మరో గుడ్ న్యూస్- త్వరలో ఆ నియామకాలు- పేర్నినాని ప్రకటన
కరోనా ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ క్రమంగా కోలుకుంటోంది. రాష్ట్రంలో కరోనా ఆంక్షలు సడలించడంతో ఇప్పుడిప్పుడే దూరప్రాంత సర్వీసులు కూడా పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదాయంపై దృష్టిపెట్టిన ఆర్టీసీ.. అదే సమయంలో పెండింగ్ పనులపైనా దృష్టిసారిస్తోంది.
ఏపీఎస్ ఆర్టీసీలో పని చేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్టీసీ అంగీకరించిందని, వారి పట్ల పూర్తి సానుభూతితో ప్రభుత్వం సైతం ఉందని, త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఇవాళ బందరులోని తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే తక్షణ పరిష్కారం చూపించారు.
అనంతపూర్, కర్నూల్, తూర్పు గోదావరి, కర్నూల్, కడప, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఆర్టీసీ కారుణ్య నియామక అభ్యర్థులు మంత్రిని కలిసి తమ కష్టాలను ఏకరువు పెట్టారు. తమ తండ్రులు, భర్తలు ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో అకాల మృత్యువు పాలయ్యారని, గత కొంత కాలంగా కారుణ్య నియామకాలు లేకపోవటంతో తాము ఎంతో ఇబ్బందులకు గురవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.కొన్నేళ్లుగా ఈ నియామకాల కోసం ఎదురుచూస్తున్నట్లు వారు తెలిపారు. కృష్ణాజిల్లాలో 78 మంది, రాష్ట్రంలో 910 మంది కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని మంత్రికి తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి పేర్నినాని మాట్లాడుతూ త్వరలోనే వీటి భర్తీ ఉంటుందని వారికి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2016 నుంచి 2020 వరకు కారుణ్య నియామకాలు భర్తీ చేయాల్సి ఉంది.