ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం- ఇక ప్రయాణాలు మానుకోవాల్సిందే...
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుండగానే సడలింపుల పేరుతో బస్సుల రాకపోకలు పునరుద్ధరించిన ఆర్టీసీకి సమస్య తీవ్రత ఏంటో ఇప్పుడు తెలిసొస్తోంది. ప్రయాణికులను పలు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయాలని కోరిన ఆర్టీసీ ఇప్పుడు తమ ఉద్యోగులకే కరోనా సోకడంతో ఏం చేయాలో తేలియక దిక్కులు చూస్తోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆర్టీసీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీన్ని ఇవాళ్టి లోకి అమల్లోకి తెస్తోంది. దీని వల్ల ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడబోతోంది.
Recommended Video
భారత్లో 15లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు... లక్ష నుంచి 1.5మిలియన్లకు ఎన్ని రోజులు పట్టిందంటే?
ఆర్టీసీలో కరోనా వ్యాప్తి...
ఏపీఎస్ ఆర్టీసీపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. రాష్ట్రంలో రోజుకు దాదాపు 100 మంది ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే వందలాది మంది ఆర్టీసీ డ్రైవర్లు, ఇతర సిబ్బంది కరోనా కారణంగా ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాలకు పరిమితమవుతున్నారు. మరికొందరు హోం క్వారంటైన్ లో ఉన్నారు. బయట కరోనా ప్రభావం తగ్గకపోయినా ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన వీరంతా ఇప్పుడు ప్రాణాలకు తెగించి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్దితి నెలకొంది. దీంతో కరోనా కాలంలోనూ బస్సులు నడిపే విషయంలో ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఆర్టీసీ కీలక నిర్ణయం..
మొదట్లో కరోనా వైరస్ కేసులను చూసీ చూడనట్లుగా వదిలేసిన ఆర్టీసీ అధికారులు.. కేసుల తీవ్రత పెరుగుతుండటంతో ఉలిక్కిపడ్డారు. ఇవాళ్టి నుంచి అవసరం లేని రూట్లలో, స్పందన తక్కువగా ఉన్న రూట్లలో బస్సు సర్వీసులు నిలిపేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ముఖ్యంగా కరోనా కేసులు పెరుగుతున్న జిల్లాల్లో వెంటనే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ప్రకటించారు. సిబ్బంది ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని తాజాగా ఈడీలు, అన్ని జిల్లాల ఆర్ఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశాలు ఇచ్చారు. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రతీ డిపో పరిధిలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భారీగా ప్రభావం...
కరోనా కారణంగా పూర్తి నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ ఇప్పుడు జనం కోసం కాస్తో కూస్తో సర్వీసులు తిప్పుతున్నా వచ్చే నాలుగు డబ్బులు డీజిల్ ఖర్చులకే సరిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు సర్వీసులను మరింత తగ్గించడం వల్ల డీజిల్ ఖర్చులకు కూడా ఎదురు పెట్టుకోవాల్సిన పరిస్ధితులు రాబోతున్నాయి. అలాగని నష్టాల పేరుతో బస్సు సర్వీసులు పూర్తిగా ఆపేయడం సాధ్యం కాదు. దీంతో తప్పనిసరిగా నష్టాలు భరిస్తూనే, అప్పులు తెచ్చయినా సరే బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. మరోవైపు ఇప్పటికే అరకొరగా నడుస్తున్న బస్సు సర్వీసులను ఇంకా తగ్గించడం వల్లే ఇక ప్రయాణికులకు మరిన్ని చుక్కలు కనిపించడం ఖాయంగా ఉంది. మరికొంతకాలం ఇదే పరిస్ధితి ఉంటుందని అధికారులు కూడా చెబుతున్నారు.