ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..? పరిమిత సంఖ్యలో బస్సు సర్వీసులు..?
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ పొడగింపుపై సర్వత్రా చర్చ జరుగుతున్నవేళ.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే సూపర్ లగ్జరీ,అల్ట్రా డీలక్స్ బస్సులకు మాత్రమే రిజర్వేషన్లు ప్రారంభించాలని నిర్ణయించింది. అది కూడా విజయవాడ బస్ స్టేషన్ నుంచి వెళ్లే సర్వీసులను మాత్రమే అనుమతించనుంది. ఇక ఏసీ బస్సుల బుకింగ్స్ను ప్రారంభించట్లేదని తెలిపింది. మొత్తంగా 115 బస్సు సర్వీసులకు టికెట్ బుకింగ్స్ ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
దశలవారీగా లాక్ డౌన్ను ఎత్తివేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ఏపీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి సైతం లాక్ డౌన్ను పూర్తిగా ఎత్తివేసే ఆలోచనలో ప్రభుత్వం లేదని చెప్పారు. పరోక్షంగా లాక్ డౌన్కు కొంత సడలింపు ఉంటుందనేది ఆయన వ్యాఖ్యల్లో స్పష్టమైంది. ఇప్పటివరకు ఏపీలో నమోదైన కేసులకు సంబంధించిన పరీక్షలు కూడా రెండు,మూడు రోజుల్లో పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. కొత్త కేసుల సంఖ్య కూడా తక్కువగానే ఉండటంతో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లోనూ ప్రధాని మోదీ కామన్ ఎగ్జిట్ స్ట్రాటజీ గురించి రాష్ట్రాలను సలహాలు,సూచనలు అడిగిన సంగతి తెలిసిందే.
Recommended Video
ఈ నేపథ్యంలో ఒకవేళ కేంద్రం లాక్ డౌన్ను ఎత్తివేసే దిశగా నిర్ణయం తీసుకుంటే.. ఒక్కసారిగా నిర్ణయాలు తీసుకోవడం,అమలుచేయడం కష్టమవుతుంది కాబట్టి ఇప్పటినుంచే ఏపీ సర్కార్ ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పరిమిత సంఖ్యలో ఆర్టీసీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటినుంచే సన్నద్దంగా ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ కరోనా కేసులు తీవ్రమైతే ఆర్టీసీ సర్వీసుల విషయంలోనూ పునరాలోచనలో పడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైతే అధికారిక ఉత్తర్వులు ఏవీ ఇంకా జారీ అవలేదు. కాబట్టి అధికారిక ఉత్తర్వులు వస్తే గానీ ఆర్టీసీ సర్వీసుల ప్రారంభంపై కచ్చితమైన స్పష్టత వచ్చే అవకాశం లేదు.