ఛార్జీల పెంపు: 20 శాతం, ఆటోలతో సమానంగా...!
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ త్వరలో ఛార్జీలు పెంపునకు రంగం సిద్ధం చేసింది. ఉద్యోగులకు జీతాలివ్వాలన్నా, ఆర్టీసీని ఆర్ధిక భారం నుంచి కాపాడాలన్నా ఇదే మార్గమమని యాజమాన్యం నిర్ణయించింది. పల్లె వెలుగు బస్సుల నుంచి ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్లగ్జరీ, గరుడ, వెన్నెల వరకు అన్నిరకాల బస్సుల్లో ఛార్జీలు పెంచాలని యజమాన్యం యోచిస్తోంది.
ఈ ఛార్జీల పెంపు 20 శాతంగా ఉండబోతోంది. ఈ ఛార్జీల పెంపుపై రానున్న మాడు, నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఉన్నాతాధికారి తెలిపారు. ఆర్టీసీ విభజన పూర్తి అయిన తర్వాత ఏ ఛార్జీల పెంపుపై ఆ రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు.
ఛార్జీల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిస్తే ప్రయాణీకులపై రూ. 838 కోట్ల భారం పడే అవకాశం ఉంది. ఇక ఆర్టీసీ కార్మికులు ఇటీవల జరిపిన సమ్మెతో సంస్ధపై ఏటా దాదాపు రూ.960 కోట్ల భారం పడుతోందని అన్నారు. ఇప్పటికే ఆర్టీసీ వేల కొట్లలో అప్పుల్లో ఉండటం, ప్రతి ఏడాది నష్టాలు వస్తుండటంతో ఈ ఛార్జీల పెంపు తప్ప, మరో మార్గం లేదని యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఛార్జీల పెంపుపై ఆర్టీసీ ఎండీ సాంబశివరావు మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో ఛార్జీలు పెంచలేదని అన్నారు. కార్మికులకు వేతనాలు ఇవ్వాలన్నా, సంస్థను నడపాలన్నా ఛార్జీలు పెంచక తప్పదని అన్నారు. దూరప్రాంతాలు, గ్రామాల మధ్య తిరుగుతున్న ఆటోల్లో కిలోమీటరుకు సగటున 80, 90 పైసల వరకు ఛార్జీ వసూలు చేస్తున్నారు.
పల్లెవెలుగు బస్సుల్లో అది కిలోమీటరుకి 59 పైసలే ఉందని అన్నారు. ఆటోలతో సమానంగా పల్లెవెలుగు బస్సుల్లో ఛార్జీలు ఉండాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ప్రయాణికులకు మంటి సీట్లతో పాటు వినోదం కలిగించేందుకు ఆడియో ఏర్పాట్లను చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.