అర్టీసీ బాధ్యత నాది..జగన్: ఏపీలో ఆర్టీసీ సమ్మె విరమణ: ప్రభుత్వంలో విలీనం ఖాయం..!
ఏపీలో ఆర్టీసీ సమ్మె ప్రతిపాదనను జేఏసీ నేతలు విరమించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ నుండి స్పష్టమైన హామీ రావటంతో సమ్మె విరమించుకున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం కోసం నాలుగు రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీంతో..వాస్తవంగా రేపటి నుండి సమ్మెకు దిగాలని నిర్ణయించిన ఆర్టీసీ జేఏసీ నేతలు ముఖ్యమంత్రి జగన్తో సమావేశమయ్యారు. సీఎం హామీ మేరకు సమ్మె ప్రతిపాదన ఉపసంహరించుకుంటున్నట్లు జేఏపీ నేతలు ప్రకటించారు.
సీఎం భావోద్వేగం: సభలో జగన్..చంద్రబాబు ఎలా ఉన్నారంటే
జగన్తో ఆర్టీసీ జేఏసీ నేతల భేటీ..
ముఖ్యమంత్రి జగన్తో ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఏపీ సచివాలయంలో వారు ముఖ్యమంత్రితో సమావేశమై తాము సమ్మెకు పిలుపు ఇవ్వటానికి కారణాలను వివరించారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలు విన్న ముఖ్యమంత్రి..ఆర్టీసీ బాధ్యత తాను తీసుకుంటున్నానని..ఎటువంటి సందేహాలు .. అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేసారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులను చూసుకుంటా నంటూ జగన్ హామీ ఇచ్చారు. ఇప్పటికే తాను పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు కేబినెట్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్న విషయాన్ని వివరించారు. విలీనం పైన అధ్యయన కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు.
విలీనం పైన అధ్యయన కమిటీ ..
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర సర్కారు త్వరలో అధ్యయన కమిటీని నియమించనుంది. గతంలో ఆర్టీసీ ఎండీ గా..,డీజీపీగా పనిచేసి.. పదవీ విరమణ పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. కమిటీలో కార్మిక సంఘాల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. కమిటీ నియామకంపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. రెండు నెలల్లో ఈ అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్టీసీ విలీనానికి విధివిధానాలు ఖరారు చేస్తారు. ఇప్పటికే రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు తో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ఈ కమిటీకి కావాల్సిన సమాచారం..సంప్రదింపులు.. అవసరమైన సమాచారం అందించే బాధ్యతలను కృష్ణబాబుకు అప్పగించనున్నారు.
Recommended Video
సమ్మె నిర్ణయం వెనక్కు..
ముఖ్యమంత్రి జగన్తో సమావేశం తరువాత ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె మీద స్పష్టమైన ప్రకటన చేసారు. సీఎం తమకు స్పష్టమైన హామీ ఇచ్చారని..ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారని సీఎం చెప్పారని..తమకూ నమ్మకం ఉందన్నారు. తాము కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే సమ్మెకు నోటీసు ఇచ్చామని..సంస్థను కాపాడు కోవాల్సిన బాధ్యత తమ మీద ఉందన్నారు. అధ్యయన కమిటీ రెండు నెలల్లోగా నివేదిక ఇస్తుందని..అప్పటి దాకా తాము ప్రభుత్వానికి సహకరిస్తామని స్పష్టం చేసారు.