ఏపీయస్ఆర్టీసీలో వీఆర్ఎస్ అలజడి : కలెక్టర్ కన్నా ఎక్కువ జీతం..కానీ : ప్రభుత్వంలో విలీనం ఎఫెక్ట్..!
తెలంగాణ ఆర్టీసీ సమ్మె ముగిసింది. ఏపీఆయస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రజా రవాణా శాఖ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే విధంగా కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో ఉద్యోగుల్లో కొత్త ఆందోళన మొదలైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం కారణంగా ఉన్నత పదవుల్లో ఉన్న ఉద్యోగులకు నష్టం వస్తుందనే చర్చ మొదలైంది. ఇప్పటివరకూ భారీ జీతాలు..అలవెన్సులు తీసుకొంటున్న అధికారులకు విలీనంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో..తాము నష్టపోతామనే భావనలో ఉన్న సంస్థ ఉన్నతాధికారులు స్వచ్చంద పదవీ విరమణకు మొగ్గు చూపుతున్నారు. విధుల నుండి రిలీవ్ అయ్యే యోచనలో ఇద్దరు ఈడీలు..పలువురు అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు ఆర్టీసీలో ఇది కొత్త చర్చకు కారణమవుతోంది.
కలెక్టర్..ఆర్డీవో జీతాల కంటే..
ఆర్టీసీలో పని చేసే ఉన్నతాధికారుల జీతాలు ప్రభుత్వ అధికారుల జీతాల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆర్డీవో జీతం కన్నా డిపో మేనేజర్కు, జిల్లా కలెక్టర్ కన్నా ఆర్టీసీ ఆర్ఎంకు, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నా ఆర్టీసీ ఈడీలకు ఎక్కువ జీతభత్యాలు ఉన్నాయి. జనవరి నుంచి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అయితే ఇవన్నీ తగ్గిపోతాయి. ఈడీలకు ప్రస్తుతం అన్నీ కలిపి రూ.2.5- 3లక్షల వరకూ లభిస్తోంది. విలీనం తర్వాత దీనిలో రూ.లక్షకు పైగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పదవీ విరమణ వయసు రెండేళ్లు పెరగడంతో ఉద్యోగంలో కొనసాగినా రూ.24లక్షలకు పైగా వదులుకోవాల్సి వస్తుంది. రిటైర్మెంట్ ప్రయోజనాలు ఆర్టీసీలో భారీగా ఉంటాయి. ఈడీ స్థాయి అధికారికి రూ.50లక్షలకు పైగానే అందుతుంది. అదే ప్రభుత్వంలో అయితే రూ.20లక్షలకు మించి దక్కదు
వీఆర్ఎస్ బెటర్ అనే ఆలోచనలో..
ఆదాయ పరంగా ఇంత భారీగా నష్టపోయే పరిస్థితి ఉందనే కారణంతో..ఉన్నత స్థానాల్లో ఉన్న ఆర్టీసీ అధికారులు స్వచ్చంద పదవీ విరమణ దిశగా ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో జూనియర్ అసిస్టెంట్ జీతాలతో కార్మికులకు, సీనియర్ అసిస్టెంట్ జీతాలు సూపర్వైజర్లకు ఇలా పెంచుతూ జిల్లాస్థాయి అధికారికి ఉండే సీనియర్ పే స్కేలు ఆధారంగా ఆర్టీసీ అధికారులకు జీతాలు నిర్ణయిస్తారు. ఆర్టీసీ ఇప్పటి వరకూ కార్పొరేషన్ కావడంతో అధికారులకు పింఛను సదుపాయం లేదు. దీంతో యాజమాన్యాన్ని ఒప్పించి లక్షల్లో జీతాలు, అలవెన్సులు తీసుకొంటున్నారు. నష్టపోవడం కన్నా ఉద్యోగం వదులు కోవడమే మేలనే నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చారు. విలీన కమిటీతో వీరు మంతనాలు జరిపినా ఫలించలేదు. పెన్షన్ ఇవ్వడం సాధ్యంకాదని కమిటీ నివేదికలో పొందుపరిచినట్లు స్పష్టమవడంతో వీఆర్ఎస్ తప్ప మరోమార్గం లేదని భావిస్తున్నారు.
ఆ ఫదకాల రద్దుతో..అధికారుల నిర్ణయం
విలీన కమిటీతో వీరు మంతనాలు జరిపినా ఫలించలేదు. పెన్షన్ ఇవ్వడం సాధ్యంకాదని కమిటీ నివేదికలో పొందుపరిచినట్లు స్పష్టమవడంతో వీఆర్ఎస్ తప్ప మరోమార్గం లేదని భావిస్తున్నారు. ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఆర్టీసీ యాజమాన్యానికి ఇప్పటికే అప్లికేషన్లు అందజేసిన వారిద్దరూ డిసెంబరు నెలాఖరులోపే వీఆర్ఎస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. రెండేళ్లలోపు సర్వీసున్న డిపో మేనేజర్లు.. మరికొందరు అధికారులు కూడా అదేబాటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పదవీ విరమణ తర్వాత పెన్షన్లేని కార్మికులకు భరోసాగా ఆర్టీసీలో స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్(ఎ్సఆర్బీఎస్)..అదే విధంగా..ఆర్టీసీ కార్మికుడు ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబానికి అండగా ఉండేందుకు స్టాఫ్ బెన్వలెంట్ ట్రస్ట్(ఎ్సబీటీ) రద్దు కానున్నాయి. ఈ పధకాలు తమకు మేలు చేసేవని..వీటిని రద్దు చేయకుండా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే కార్యాచరణ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.