ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఏపీలో ఇక అన్నిసీట్లకూ రిజర్వేషన్ - భౌతిక దూరానికి చెక్..
కరోనా ప్రభావం మొదలయ్యాక బస్సులను పూర్తిగా తిప్పడం మానేసిన ఏపీఎస్ ఆర్టీసీ అన్లాక్ ప్రక్రియ మొదలయ్యాక తిరిగి రాకపోకలు ప్రారంభించింది. అయితే భౌతిక దూరంతో పాటు కరోనాకు సంబంధించి కేంద్రం జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను పాటించేందుకు ప్రయత్నాలు చేసిన ఆర్టీసీ.. తాజాగా భౌతిక దూరం నిబంధనకు మంగళం పాడేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల రిజర్వేషన్ సందర్భంగా సీటుకూ, సీటుకూ మధ్య టికెట్ బుక్ చేయడం లేదు. దీంతో బస్సులు సగం సీట్లలో ప్రయాణికులతోనే రాకపోకలు సాగిస్తున్నాయి. దీని వల్ల ఆర్టీసీపై పెనుభారం పడుతోంది. కానీ కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతున్నందున ఇకపై అన్ని సీట్లకూ రిజర్వేషన్ అందుబాటులోకి తీసుకు వచ్చారు.
తెలంగాణా నుండి ఏపీకి.. ఆర్టీసీ కార్గో బస్సులో అక్రమ మద్యం.. షాక్ అయిన పోలీసులు
ఆర్టీసీపై కరోనా కాటు...
కరోనా ప్రభావం మిగతా రంగాలు, వ్యవస్ధలతో పాటు ఆర్టీసీపైనా తీవ్రంగా పడింది. కరోనా కారణంగా బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ప్రజా సేవ పేరుతో అప్పటికే కోట్లాది రూపాయల నష్టాల్లో ఉన్న ఆర్టీసికి కరోనా శరాఘాతంగా పరిణమించింది. దీంతో కేంద్రం ఎప్పుడు అనుమతిస్తుందా అని ఎదురుచూసిన ఆర్టీసీ.. అన్లాక్ ప్రక్రియతో బస్సులను రోడ్లపైకి పంపింది. ఆ తర్వాత కూడా భౌతిక దూరంతో పాటు ఇతర నిబంధనల అమలుతో ఆర్టీసీ బస్సులకు అనుకున్నంత ఆదరణ లభించలేదు. ఇప్పటికీ గతంలోలా కనీసం ఆదరణ ఉన్న రూట్లలో అన్ని బస్సుల్లో అన్ని సీట్లు నిండుతున్నాయా అంటే అవునని కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి.
భౌతిక దూరానికి మంగళం...
ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకూ కేంద్రం మార్గదర్శకాల ప్రకారం అమలు చేసిన సోషల్ డిస్టెన్స్ నిబంధన వల్ల భారీ నష్టాలు తప్పడం లేదు. దీంతో ఇకపై భౌతిక దూరం నిబంధనను పక్కనబెట్టి ఆన్లైన్ రిజర్వేషన్లలో అన్ని సీట్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఈ నిర్ణయంతో ఇప్పటివరకూ సగం సీట్లతోనే రాకపోకలు సాగించిన ఆర్టీసీ బస్సులు ఇకపై పూర్తి సామర్ధ్యంతో నడుస్తాయి. దీంతో ఆర్టీసీ ఆదాయం కూడా రెట్టింపు కానుంది. భౌతిక దూరం నిబంధన తప్ప మిగతా అన్ని నిబంధనలను పాటించేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా నియంత్రణలోనే ఉన్నందున బస్సుల్లో భౌతిక దూరం ఇక అవసరం లేదని ఆర్టీసీ భావించినట్లు సమాచారం.
ప్రయాణికులకు వెసులుబాటు...
ఆర్టీసీ బస్సుల్లో భౌతిక దూరం నిబంధన పేరుతో సగం సీట్లకే రిజర్వేషన్ అందుబాటులో ఉండటంతో ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. ఉన్న సగం సీట్లలోనే మహిళలకు కేటాయింపులు కూడా ఉండటంతో అరకొర సీట్లకే రిజర్వేషన్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పూర్తి స్ధాయిలో సీట్ల భర్తీకి ఆన్లైన్ రిజర్వేషన్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయి. ముఖ్యంగా వారాంతపు సమయాల్లో, రద్దీ రూట్లలో ప్రయాణికులకు దీని వల్ల ప్రయోజనం ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇంకా రద్దీ పెరిగితే భవిష్యత్తుల్లో మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు.
Recommended Video
కరోనా ప్రభావం తగ్గినందునే...
ఏపీలో రెండు వారాలుగా కరోనా ప్రభావం తగ్గుతూ వస్తోంది. రెండు వారాల క్రితం పది వేలకు పైగా నమోదైన కేసులు ఇప్పుడు ఆరు, ఏడు వేల దగ్గర్లో ఉంటున్నాయి. ప్రజల్లో అవగాహన పెరిగింది. విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో సిటీ బస్సులు కూడా తిప్పుతున్నారు. దీంతో కరోనా కారణంగా సగం సీట్లు మాత్రమే బుకింగ్కు అనుమతించి నష్టాలు మూటగట్టుకోవడం ఎందుకని ఆర్టీసీ భావించినట్లు తెలుస్తోంది. అసలే ప్రధాన ఆదాయ వనరైన హైదరాబాద్ బస్సులు లేకపోవడం, భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చినా దాదాపు లక్ష కిలోమీటర్ల మేర దూరం తగ్గించుకోవాల్సి రావడం వంటి కారణాలతో ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ నష్టాన్ని ఎలాగో భరించక తప్పదు. ఇప్పుడు కరోనా అదుపులోకి వచ్చాక కూడా భౌతిక దూరం పేరుతో నష్టాలు కొనితెచ్చుకోవడం ఎందుకనే భావనతో ఈ నిబంధన ఎత్తేసినట్లు తెలుస్తోంది. దీని ప్రభావం చూశాక పరిస్ధితిని బట్టి భవిష్యత్తులో మార్పులు చేసే అవకాశాలూ లేకపోలేదు.