ఆర్టీసీలోని 52వేల సిబ్బంది ప్రభుత్వంలోకి: 60 ఏళ్లకు రిటైర్మెంట్: పాలక మండలి కీలక నిర్ణయాలు..!
ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటానికి ఏపీయస్ ఆర్టీసీ పాలక మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొద్ది రోజులుగా ఈ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పైన పాలక వర్గం చర్చించింది. సంస్థలోని మొత్తం 52 వేల సిబ్బందిని ప్రజా రావాణా శాఖలో విలీనం చేసేందుకు ఆమోదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు పాలక మండి ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా సంస్థలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో తొలి విడతలో 350 విద్యుత్ బస్సులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పాలక మండలి నిర్ణయాలను అధికారికంగా ప్రభుత్వానికి నివేదించనున్నారు. జనవరి నుండి ఆర్టీసీ ఉద్యోగులు ఇక ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్నింటా అర్హత పొందనున్నారు.
ఆర్టీసీ రణం ..చర్చలు మొదలుపెట్టాకే ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్య క్రియలన్న భార్య జయ.. జేఏసీ ప్రతిన
ఆర్టీసీ విలీనానికి ఆమోదం..
ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హమీ మేరకు ఇప్పటికే మొదలైన అడుగులకు అధికారిక ఆమోదం లభించింది. ఏపీ కేబినెట్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా అధ్యయనానికి కమిటీ వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ నివేదిక మేరకు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయటానికి సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండటంతో..ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేసి ఆర్టీసీని ఆ శాఖ కింద మార్చే విధంగా సిఫార్సు చేసారు. దీనిని ప్రభుత్వం ఆమోదించి..నిబంధనల ప్రకారం ఆర్టీసీ యాజమన్యానికి తమ ప్రతిపాదన పంపింది. దీని పైన సమావేశమైన ఆర్టీసీ యాజమన్యం రోడ్డు రవాణా సంస్థగా ఉన్న ఏపీఎస్ ఆర్టీసీని ప్రజా రవాణా శాఖ (పీటీడీ)గా మార్చేందుకు ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వంలో విలీనం దిశగా తొలి అడుగు పూర్తయింది. ఇక, ఉద్యోగులు..సంస్థల విషయంలోనూ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
52 వేల మంది సిబ్బంది..60 ఏళ్లకు రిటైర్మెంట్
ఆర్టీసీ పాలక మండలి సమావేశంలో కార్మికులకు సంబంధించిన ఇతర నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. అందులో భాగంగా.. ఆర్టీసీలో పని చేస్తున్న ఉన్నతాధికారి నుంచి కింది స్థాయి కార్మికుడు వరకు మొత్తం 52 వేల మందిని పీటీడీలో విలీనం చేసేందకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో సిబ్బంది పదవీ విరమణ వయస్సుని 60కి పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికీ పాలక మండలి పచ్చ జెండా ఊపింది. ఆర్టీసీలో మెడికల్ అన్ ఫిట్ అయిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్న 2015 నాటి సర్క్యులర్ను రద్దు చేసినట్లు తెలిసింది. అదే విధంగా గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఆర్టీసీ సిబ్బందికి ఇచ్చే ఇంక్రిమెంట్ను శాశ్వతంగా రద్దు చేసింది. తొలి విడతగా 350 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.
మంత్రి పేర్ని నాని తాజా వ్యాఖ్యలతో వేగంగా..
కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో ఆర్టీసీ విలీనం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో కమిటీ వేసారు..అక్కడ ఏ మన్నూ చేయలేదు. ఆరు నెలల తరువాత ఏమవుతోందో చూడాలి అంటూ వ్యాఖ్యానించారు. దీని పైన ఏపీ రవాణా మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలతో మరింత కసిగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా ఆర్టీసీ పాలకవర్గం సమావేశమై ప్రభుత్వ నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇక, జనవరి నుండి ఏపీయస్ ఆర్టీసీలో పని చేస్తున్న 52 వేల మంది సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం అన్ని రకాలుగా బెనిఫిట్స్ అందనున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం అధికార విధానంలో ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ కేబినెట్ లో ఈరోజు అక్కడి సమ్మె..తెలంగాణ ఆర్టీసీ భవిష్యత్ పైన కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.