'ఉమ్మడి' హైదరాబాద్లో మినీ బస్ స్టేషన్?: ఏపీఎస్ఆర్టీసీ ఆలోచన
విజయవాడ: ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సొంతగా మినీ బస్టాండు ఏర్పాటు ఏపీఎస్ఆర్టీసీ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాదుకు నిత్యం పెద్ద సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగిస్తాయి.
హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, ఒంగోలు, గుంటూరు తదితర ఏపీ ప్రాంతాలకు చాలా బస్సులు రోజూ ప్రయాణిస్తుంటాయి. ఎక్కువగా హైదరాబాదులోని బిహెచ్ఈఎల్, ఎంజిబిఎస్ మీదుగా బస్సులు వస్తుంటాయి.
కెపిహెచ్బి నుంచి ఎంజీబిఎస్ వరకు మధ్యలో పలు స్టాపుల్లో ఏపీకి వచ్చే వారు ఎక్కుతుంటారు. అయితే, ఈ మధ్యలో ఒక బస్ స్టేషన్ లేదు. దీంతో ప్రయాణీకులు రోడ్ల పైన ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యలో ఓ మినీ బస్టాండు ఏర్పాటు చేసే ఆలోచనలో ఏపీఎస్ఆర్టీసీ ఉందని తెలుస్తోంది.
రోడ్ల పైన బస్సులు ఆపడం వల్ల ట్రాఫిక్ సమస్య కూడా ఎదురవుతోంది. పదుల సంఖ్యలో బస్సులు ఆపేందుకు వీలుగా ఓ బస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ భావిస్తోందని అంటున్నారు. ఢిల్లీ, చండీగఢ్లలో ఇలాగే బస్ స్టేషన్లు ఉన్నాయి. బస్సులకు పార్కింగ్, డ్రైవర్లకు విశ్రాంతి కోసం కూడా ఓ భవనం నిర్మించే ఆలోచన చేస్తున్నారు.