అమల్లోకి ఆర్టీసీ కొత్త ఛార్జీలు ఇలా..: బస్సు పాస్ ల పైనా: పెంపు ఏ మేర పెరిగాయంటే..!
ఏపీయస్ఆర్టీసీలో కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. పల్లె బస్సులు.. సిటీ సర్వీసుల్లో కనీస ప్రయాణ చార్జీ రూ.5 గా ఉండనుంది. వెన్నెల స్లీపర్ సర్వీసుల్లో ఎలాంటి పెంపు ఉండబోదని ఆర్టీసీ స్పష్టం చేసింది. దూరప్రాంత ప్రయాణికుల్లో ఎక్కువ మంది ప్రయాణించే ఎక్స్ప్రెస్.. అలా్ట్ర డీలక్స్.. సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రతి కిలోమీటరుకు 20పైసలు పెంచిన యాజమానన్యం.. తక్కువ సంఖ్యలో నడిచే సర్వీసులైన ఇంద్ర, గరుడ, అమరావతి బస్సుల్లో పది పైసలు మాత్రమే పెంచింది. దూరప్రాంత ప్రైవేటు బస్సులతో పోటీ తట్టుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికార వర్గాలు తెలిపాయి. విద్యార్ధుల నెల వారీ బస్ పాస్ లపైన రూ 25 వరకు పెంచింది. పెరిగిన ధరలతో దూరపు ప్రయాణాల టిక్కెట్ల ధరలు భారీగా పెరిగాయి.
వంశీ పైన అనర్హత వేటు లేనట్లే: జగన్ కొత్త ప్లాన్ ఇదే..: బీజేపీకి దారి చూపించారు..నష్టం ఎవరికంటే..!
టోల్ ఫీజు భారం ప్రయాణీకులదే..
ప్రయాణాల్లో బస్సుల నుంచి టోల్ ప్లాజా వసూలు చేసే చార్జీలను ప్రయాణికులు భరించాల్సిందేనని ఆర్టీసీ స్ప ష్టం చేసింది. దీంతోపాటు పాసింజర్ సెస్, అమెనిటీస్, సేఫ్టీ సెస్, జీఎ్సటీ(ఏసీ బస్సుల్లో) తదితరాలు అదనంగా మోయాల్సిందే. చిల్లర సమస్య లేకుండా బస్సు సర్వీసును బట్టి రూ.ఐదు రౌండాఫ్ చేస్తామని, వెన్నెల స్లీపర్ బస్సుల్లో రూ.10 ఉంటుందని తెలిపింది. తిరుమల కొండపైకి వెళ్లే సప్తగిరి బస్సుల్లో ప్రస్తుతం రూ.55 ఉన్న టికెట్ ధర బుధవారం నుంచి రూ.65 కాబోతోంది. వెళ్లి వచ్చేందుకు ఒకేసారి టికెట్ కొంటే ప్రస్తుతం రూ.100 ఉండగా, ఇకపై రూ.120 చెల్లించాలి. ఆర్టీసీ బస్సుల్లో పెంచిన చార్జీలు ప్రకటించే సమయానికి ముందు ఆన్లైన్లో టికెట్లు రిజర్వేషన్ చేసుకున్న వారికి పెంపు వర్తించబోదు. మంగళవారం సాయంత్రం దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో టికెట్ కొనుగోలు చేసిన వాళ్లు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రయాణించే దూరానికి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.
విద్యార్దుల పాస్ లపైనా భారం..
విద్యార్థులు ఆర్డినరీ బస్సుల్లో విద్యాసంస్థలకు వెళితే ఇప్పటిదాకా ప్రతినెలా రూ.130 ఆర్టీసీ వసూలు చేస్తోంది. ఇకపై రూ.155 విద్యార్థులు చెల్లించాలి. స్పెషల్ బస్సులు ఎక్కితే వసూలుచేసే రూ.210ను.. రూ.245కు పెంచారు. మూడు నెల పాస్కు ఆర్డినరీలో రూ.465, స్పెషల్ బస్సుల్లో రూ.735 వసూలు చేస్తారు. ఒక్క రోజుకు ఇచ్చే రూట్ పాస్ల ధరలు రూ.ఐదునుంచి రూ.15వరకూ పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఐదు కిలోమీటర్ల లోపల విద్యాసంస్థలు ఉంటే రూ.85, పది కిలోమీటర్లు అయితే రూ.105 పెంచుతూ, చివరిగా 50కిలోమీటర్లు అయితే రూ.420 చొప్పున నెల పాస్కు వసూలు చేయబోతున్నట్లు ఆర్టీసీ వివరించింది.
దూరపు ప్రయాణాలపైన భారీగా వడ్డన..
ఇక, స్వల్పంగా ఛార్జీలు పెంచామని ఆర్టీసీ చెబుతున్నా..దూరపు ప్రయాణీకుల పైన భారీగా భారం పడుతోంది. ప్రస్తుతం అమరావతి నుండి హైదరాబాద్ కు గరుడ టిక్కెట్ రూ 630 కాగా..అది రూ655కు పెరిగింది. అదే విధంగా సూపర్ లగ్జరీలో రూ 550 గా ఉన్న ధర రూ595కి పెంచారు. ఇక, లగ్జరీ సర్వీసు టిక్కెట్ రూ 355 కాగా..ఇప్పుడు రూ 410కి పెరిగింది. ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో రూ 270 గా ఉన్న టిక్కెట్ రూ 325కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా అమరావతి నుండి విశాఖకు కొత్త ధరల ప్రకారం గరుడ లో 840-880 కి పెరగ్గా, సూపర్ లగ్జరీలో 720-755కు పెంచారు. ఇక, లగ్జరీ లో రూ 475-550 కి పెంచగా.. ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో అది రూ 355-430కి పెరిగింది. అదే విధంగా తిరుపతికి గరుడ బస్సుల్లో ఇక నుండి టిక్కెట్ రూ 1075గా నిర్ణయించారు. ఇప్పటి వరకు రూ.1025గా ఉండేది. అదే విధంగా సూపర్ లగ్జరీలో రూ 800 నుండి 845కు పెరగ్గా.. లగ్జరీలో రూ 530- 610కు పెరిగింది. ఇక..ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో రూ 405 నుంది రూ 485కు ఛార్జీ పెరిగింది.