ఏపీలో మళ్లీ తెరపైకి విద్యుత్ బస్సులు- అమరావతి, కాకినాడకు షాక్- కొత్త ప్లాన్ ఇదే
ఏపీలో విద్యుత్ బస్సుల అరంగేట్రం కోసం జరుగుతున్న ప్రయత్నాలు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తయారు చేసిన ఈ ప్రతిపాదనలకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందడుగు పడింది. అయితే నిధుల కొరత కారణంగా అప్పట్లో వైసీపీ సర్కారు దీన్ని పక్కనబెట్టింది. ఇప్పుడు ప్లాన్లో కొన్ని మార్పులతో విద్యుత్ బస్సులను రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే ప్రధాన నగరాల్లో విద్యుత్ బస్సులు అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోసారి విద్యుత్ బస్సుల ప్రతిపాదనలు
ఏపీలో సంప్రదాయ డీజిల్తో పనిచేసే బస్సుల స్ధానంలో విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తే ఖర్చు, సమయం ఆదాతో పాటు కాలుష్య నివారణకు కూడా వీలవుతుందని ఆర్టీసీ భావించింది. కేంద్ర ప్రభుత్వ ఫేమ్-2 పథకంలో భాగంగా రాష్ట్రంలోని కీలక నగరాల్లో విద్యుత్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
దీని ప్రకారం విజయవాడ, విశాఖ, తిరుపతి, కాకినాడ, అమరావతిలో ఈ బస్సులను ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ లోపు ఈ ప్రణాళిక సిద్ధం చేయించిన టీడీపీ ప్రభుత్వం స్ధానంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా ఆర్టీసీ ప్రతిపాదనలను మాత్రం సీరియస్గానే పరిశీలించారు. కానీ నిధుల కొరతతో ఈ ప్రతిపాదనలకు బ్రేక్ పడింది.
విజయవాడ, వైజాగ్, తిరుపతికే విద్యుత్ బస్సులు
గతంలో విజయవాడ, విశాఖకు వంద విద్యుత్ బస్సుల చొప్పున, మిగిలిన అమరావతి, కాకినాడ, తిరుపతికి 50 బస్సుల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లెక్కన 350 బస్సులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే గతంలో రూపొందించిన ఈ ప్లాన్ ప్రకారం టెండర్లను న్యాయసమీక్ష కోసం పంపినప్పుడు అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఈ ప్రతిపాదన మూలనపడింది. ఇప్పుడు తాజాగా రూపొందించిన ప్లాన్ ప్రకారం మూడు నగరాలకే ఈ బస్సులు పరిమితం చేస్తారు. ఇందులో విజయవాడ, వైజాగ్కు వందేసి బస్సులు చొప్పున అలాగే ఉంచుతూ, తిరుపతికి మాత్రం 150 బస్సులను కేటాయించారు.
Recommended Video
అమరావతి, కాకినాడకు నిరాశే
గతంలో ప్రభుత్వం రాజధాని ప్రాంతంగా ప్రకటించిన అమరావతికి 50 విద్యుత్ బస్సులను కేటాయించింది. అలాగే తీర ప్రాంతంగా అభివృద్ది చెందుతున్న కీలక నగరం కాకినాడకు మరో 50 బస్సులను కేటాయించారు. కానీ మారిన పరిస్ధితుల్లో అమరావతి నుంచి రాజధాని తరలింపు నేపథ్యంలో అక్కడ విద్యుత్ బస్సుల అవసరం లేదని తేల్చేసినట్లు తెలుస్తోంది.
అలాగే కాకినాడలో విద్యుత్ బస్సుల వాడకం స్ధాయిలో జనాభా కూడా లేదని భావించినట్లు సమాచారం. అందుకే ఈ రెండు నగరాలను జాబితా నుంచి తొలగిస్తూ ఆర్టీసీ కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని ప్రభుత్వం ఆమోదిస్తే త్వరలోనే మిగతా నగరాల్లో విద్యుత్ బస్సులు రోడ్డెక్కే అవకాశం ఉంటుంది.