వృద్ధులకు ఆర్టీసీ వరం: ఏపీలో మరో రూ. 1000 కోట్ల పెట్టుబడులు
అమరావతి: ఏపీలోని వయోవృద్ధులకు ఏపీఎస్ఆర్టీసీ అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది. అర్టీసీ బస్సుల్లో 25 శాంత రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సాంబశివరావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ ఆఫర్ జులై 1 నుంచి అమలులోకి రానుందన్నారు.
రాష్ట్రంలోని సాధారణ బస్సులతో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు ఈ రాయితీ వర్తింసుందని ఆయన తెలిపారు. 60 ఏళ్లు, ఆపై వయస్సు ఉన్న వారికి సాధారణ ఛార్జీలో 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వయోవృద్ధులు టికెట్ కొనుగోలు చేసే సమయంలో, రిజర్వ్ చేసుకునే సమయంలో ఆధార్ కార్డు చూపించి రాయితీని పొందవచ్చన్నారు.
ఏపీలో మరో రూ. 1000 కోట్ల పెట్టుబడులు
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని చైనా పరిశ్రమలు ముందుకొచ్చాయి. చైనాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని మానవ వనరులు, నూతన పారిశ్రామిక విధానం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు.
దీంతో ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు పలు సంస్ధలు ఆసక్తిని చూపాయి. ఈ క్రమంలో రూ.1,000 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయడానికి మొబైల్స్ ఉత్పత్తుల సంస్థ 'ఒప్పో' ముందుకొచ్చింది. ఒప్పో వైస్ ప్రెసిడెంట్ ఎరిక్, ఎండీ జోన్, ప్లానింగ్ డైరెక్టర్ స్పెటర్తో చంద్రబాబు బృందం సమావేశమైంది.
ఈ సందర్భంగా జూలైలో ఏపీలో పర్యటించి కంపెనీ స్థాపనకు అనువైన భూమిని ఎంపిక చేసుకోవాలని ఒప్పో ఎండీని ముఖ్యమంత్రి కోరారు. అంతక ముందు గుయాన్లోని జీఐసీసీ ఇండస్ట్రియల్ పార్క్లోని వైద్య పరికరాల ఉత్పత్తి కేంద్రాన్ని చంద్రబాబు సందర్శించారు.
విశాఖపట్నం సమీపంలో నెలకొల్పనున్న వైద్య పరికరాల తయారీ హబ్లో భాగస్వాములు కావాలన్న ఆయన సూచనపై జీఐసీసీ సానుకూలంగా స్పందించింది. అంతక ముందు ఏపీ-చైనా కంపెనీల కాన్ఫరెన్స్లో పాల్గొన్న చైనా ప్రభుత్వ రంగంలోని అగ్రగామి సంస్థ సౌత హ్యూటన్ కంపెనీ ప్రతినిధి హ్యూటన్, చంద్రబాబుతో భేటీ అయ్యారు.
పారిశుద్ధ్య నిర్వహణలో అందిస్తున్న సేవలను గురించి చంద్రబాబుకు వివరించారు. క్లీన్ ఎనర్జీలో 14 ఏళ్ల అనుభవం కలిగిన కెడా... ఈ రంగంలో ఏపీతో భాగస్వామి అయ్యేందుకు ఆసక్తి కనబరచింది. పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా (పవర్ చైనా) అఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో చేపట్టిన డ్యాములు, బ్రిడ్జిలు, రైల్వే లైన్లు, సోలార్ ప్రాజెక్టుల గురించి ఫార్ట్ ఫిలిమ్ ద్వారా వివరించింది.
అనంతరం ఏపీ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు బృందానికి తెలిపింది. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ చైనా సహా ప్రపంచమంతా బుద్ధిజం వ్యాప్తి చెందుతోందని, ఏపీ, చైనా మధ్య బుద్ధిజం వారధిలా పనిచేస్తుందని అన్నారు. ఏపీలో 14 బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయని చెప్పారు.