రైల్వే బాటలో ఏపీఎస్ఆర్టీసీ.. ఇక ఆన్ లైన్, కరెంట్ బుకింగ్ లోనే టికెట్లు.. కండక్టర్లకు విశ్రాంతి..
కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్ధను తిరిగి గాడిన పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్ అనంతరం బస్సు, రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం చర్చలు జరుపుతోంది. వీటిలో ఆమోదించిన ఓ ప్రతిపాదన ప్రకారం ఇకపై ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల వ్యవస్ధకు బదులుగా ఆన్ లైన్ టికెట్లను ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అదే జరిగితే ఇక బస్సుల్లో టికెట్లు తీసుకునే అవసరం ఉండదు
Recommended Video
Coronavirus: ఒక్క రోజులో 45 మందికి కరోనా పాజిటివ్, బెంగళూరులో 163, పేషంట్ నెంబర్. 533 దెబ్బ !
కరోనా తర్వాత ఆర్టీసీలో మార్పులు..
కరోనా వైరస్ కారణంగా విధించిన మూడో విడత లాక్ డౌన్ ఈ నెల 17తో ముగియనుంది. ఆ తర్వాత పరిస్ధితిని బట్టి పొడిగింపు లేదా సడలింపులు ఉండొచ్చు. అయితే లాక్ డౌన్ ముగిశాక ప్రజారవాణా పునరుద్ధరణ కోసం కేంద్రం సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఏపీలో ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుద్దరణపై ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. దీన్ని ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని డిపోలకు పంపిందించి. ఇందులో బస్సు సర్వీసుల నిర్వహణ, టికెటింగ్ విధానం, ప్రయాణికుల భద్రత వంటి అంశాలు ఉన్నాయి.
కరోనా ఎఫెక్ట్- ఆర్టీసీ కండక్టర్లకు విశ్రాంతి...
కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం నేపథ్యంలో కొంతకాలం ఏపీఎస్ఆర్టీసీ బస్సు కండక్టర్లు కనిపించరు. ప్రయాణికులు ఆన్ లైన్లో కానీ డ్రైవర్ వద్ద కానీ టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా వీలైనన్ని ఎక్కువ సర్వీసులకు ఆన్ లైన్ టికెట్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తోంది. తద్వారా కండక్టర్లకు బదులుగా ఆన్ లైన్ లోనే టికెట్లు తీసుకునే వీలు కలుగుతుంది. అలాగే నగదు రహిత లావాదేవీలకు వీలు కలుగుతుంది. మొత్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అవకాశాలకు చెక్ పడుతుంది.
రైల్వే తరహాలో ఆన్ లైన్ లేదా కరెంట్ బుకింగ్...
ప్రస్తుతం భారతీయ రైల్వేల్లో టికెట్ బుకింగ్ కోసం రెండు విధానాలను అమలు చేస్తున్నారు. వీటిలో ఒకటి ఆన్ లైన్ రిజర్వేషన్, రెండు సాధారణ కరెంటు బుకింగ్. ఈ రెండూ కాకుండా నేరుగా రైళ్లు ఎక్కేవారికి ఫైన్ల ద్వారా టీసీలు టికెట్లు జారీ చేస్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీలోనూ అదే తరహా విధానం రానుంది. ఇకపై ఏపీలో ఆర్టీసీ బస్సులు ఎక్కాలనుకునే వారు ఆన్ లైన్ ద్వారా టికెట్లు తీసుకోవాలి. లేదా బస్టాండ్లలో కరెంటు బుకింగ్ క్యూలో నిలబడి టికెట్ తీసుకోవాలి.
ఎంతెంత దూరానికి ఏయే టికెట్లు..
150 కిలోమీటర్ల పైగా దూరం ప్రయాణించే నాన్ ఏసీ సర్వీసులకు ఐదు స్టాప్ లు ఉండే వాటికి కూడా ఆన్ లైన్ టికెట్లు తీసుకోవాల్సిందే. లేకపోతే బస్టాండ్ కరెంటు బుకింగ్స్ లో తీసుకోవాలి. బస్సు బయలుదేరే గంట మందు వరకూ కరెంటు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి. 150 కిలోమీటర్ల లోపు వెళ్లే సర్వీసులకు కూడా కరెంటు బుకింగ్స్ కేంద్రాల్లో టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నాన్ స్టాప్ సర్వీసులకు కూడా ఆన్ లైన్ రిజర్వేషన్లు అందుబాటులోకి రానున్నాయి. పల్లెవెలుగు బస్సుల్లో ఎక్కాలన్నా ఆర్టీసీ కరెంటు బుకింగ్ కేంద్రాల వద్ద కానీ, బస్టాపుల్లో ఆర్టీసీ సిబ్బంది టిమ్ మెషీన్ల ద్వారా కానీ, ఆర్టీసీ ఆధీకృత ఏజెంట్ల ద్వారా కానీ టికెట్లు తీసుకోవాల్సిందే. సిటీ బస్సుల కోసం నిర్ణీత స్టాపుల్లో టికెట్లను విక్రయిస్తారు.
వారం ముందే రిజర్వేషన్లు..
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఆన్ లైన్ బుకింగ్ చేసుకోవాలంటే ప్రస్తుతం నెల రోజులకు ముందే అవకాశం కల్పిస్తున్నారు. కానీ తాజా మార్పుల ప్రకారం ఈ గడువును వారానికే పరిమితం చేస్తారు. అంటే వారం ముందు మాత్రమే ఏ సర్వీసుకైనా ఆన్ లైన్ రిజర్వేషన్ అవకాశం ఉంటుంది. తద్వారా చివరి నిమిషంలో ఆన్ లైన్ రిజర్వేషన్లు చేసుకోవాలనుకునే వారికి కూడా అవకాశం ఉంటుంది. కరెంటు బుకింగ్స్ ఎలాగో బస్సు బయలుదేరే గంట ముందు వరకూ అందుబాటులో ఉంటాయి.